జూనియర్ ఎన్టీఆర్ వైసీపీలో చేరడం ఏంటి ?

జూనియర్ ఎన్టీఆర్ వైసీపీలో చేరడం ఏంటి ?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా జూనియర్ ఎన్టీఆర్ వైసీపీలో చేరుతారని అనేక రకమైన కథనాలు వండి వారుస్తున్నారు. అవి ఎంత వరకు నిజమో కొంచెం లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీ పైన తనకున్న ఇష్టాన్ని ఆ పార్టీ కోసం తను ఏమైనా చేస్తానని అనేక సార్లు చెప్పి ఉన్నాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ప్రచారంలో ప్రధాన భూమిక పోషించారు. పార్టీ ఓడిపోయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ లో మాత్రం సీనియర్ ఎన్టీఆర్ ని చూసుకున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. ఆ తరువాత క్రమంగా తెలుగుదేశం పార్టీలో హరికృష్ణ కి చంద్రబాబు గారు ప్రాధాన్యత తగ్గిస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీకి దూరమవడం జరిగింది. అయితే అప్పుడప్పుడు మీడియాలో మీరు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారా అన్న ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పకుండా “తాత గారు స్థాపించిన పార్టీకి సేవ చేయడానికి నందమూరి కుటుంబం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది” అని సమాధానం దాటవేస్తూ వెళ్లేవారు. అయితే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించిన తర్వాత నందమూరి కుటుంబాన్ని మరీ ముఖ్యంగా హరికృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు దూరం పెట్టారు. దానికి కారణం లేకపోలేదు.

చంద్రబాబుకి తన తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఉన్నది. బయటకి చెప్పకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీని తన కుమారుడైన నారా లోకేష్ కి అప్పచెప్పాలని చంద్రబాబు కోరిక. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో ఉంటే నారా లోకేష్ కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కువ ప్రజాభిమానం ఉండే అవకాశం వుంది. అది అతనికి సినిమా క్రేజ్ వల్ల కావచ్చు లేకపోతే ఎన్టీఆర్ పోలికలు వల్ల లేకపోతే తన వాగ్ధాటి వల్ల కావచ్చు. ఏవిధంగా చూసినా ఒక సామాన్య తెలుగుదేశం కార్యకర్త కి నారా లోకేష్ కంటే కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నడపడానికి సరైన నాయకుడు అని భావించే అవకాశం వుంది. ఇంత చిన్న విషయం నారా చంద్రబాబుకి తెలియంది కాదు. అందుకే వ్యూహాత్మకంగా జూనియర్ ఎన్టీఆర్ కి ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా చేస్తూ అదే సమయంలో నారా లోకేష్ కి మంత్రి పదవి మూడు కీలకమైన శాఖలు కూడా అప్పజెప్పారు. ఈ ఐదేళ్ల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాలకే పరిమితం కాగా నారా లోకేష్ మాత్రం తెలుగుదేశంలో ఒక వెలుగు వెలిగారు

ఇదంతా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కథ . 2019 ఎన్నికల్లో టీడీపీ కి ఘోర పరాభవం ఎదురైంది. తెలుగుదేశం పార్టీ ఓటమికి నారా లోకేష్ కూడా ఒక కారణం అని కొంతమంది తెలుగుదేశం అభిమానులు అభిప్రాయం. కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ తన 35 సంవత్సరాల రాజకీయ జీవిత కాలంలో అత్యంత బలహీనంగా ఉంది. ఈ తరుణంలో పార్టీ తిరిగి పునరుత్తేజం చెందాలంటే ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కావాలనేది సగటు తెలుగుదేశం పార్టీ అభిమాని కోరిక.

తెలుగుదేశం అభిమానులు కోరిక అలా ఉండగా మీడియా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరతారని ప్రచారం మొదలుపెట్టింది. దీనికి ఒక నేపథ్యం ఉంది. అదేంటంటే 2019 ఎన్నికల ముందు మార్చి నెలలో జూనియర్ ఎన్టీఆర్ కి స్వయానా మామ అయినా నార్నె శ్రీనివాస్ గారు వైసిపి కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మీడియా చెబుతున్న కథనం ప్రకారం నార్నే శ్రీనివాసరావు మరియు కోడలి నాని ముఖ్యమంత్రితో మంతనాలు చేశారని జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలోకి ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంబాసిడర్ గా నియమించాలని అది పార్టీ కి మరింత బలం అవుతుందని దానికి జగన్ కూడా ఒప్పుకున్నారు అనేది కథనం. జగన్ తో మాట్లాడటమే కాకుండా వీరిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ తో కూడా మాట్లాడారని ఎన్టీఆర్ కూడా సుముఖంగా ఉన్నారు అని చెప్పుకొస్తున్నారు.

అయితే కాసేపు జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం ఎలాంటిదో మనం చూస్తే జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుండి ఒక కసి తో పెరిగిన వ్యక్తి. అత్యంత పిన్న వయసులోనే తెలుగు తెరకి హీరోగా పరిచయం అయ్యారు. తన మొదటి నాలుగు సినిమాలతోనే 25 సంవత్సరాలు తెలుగు చలన చిత్రం పరిశ్రమని మకుటం లేని మహారాజుగా ఏలిన చిరంజీవికి పోటీగా నిలిచారు. దీన్నిబట్టి మనకు ఏం అర్థమవుతుంది? జూనియర్ ఎన్టీఆర్ మామూలుగా అయితే హీరో అయితే చాలులే అని సంతృప్తి పడే పోవచ్చు. కానీ తాను తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరో గా ఎదగాలని తన చేయని ప్రయత్నం లేదు. నెంబర్ వన్ కాకపోయినా టాప్ త్రీ హీరోలలో ఒకరిగా మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నారు. అంతటి పట్టుదల ఉన్న వ్యక్తి ఒక రాష్ట్ర అంబాసిడర్ గా సంతృప్తి చెందుతారు అనేది కేవలం అపోహ మాత్రమే. జూనియర్ కి ఇంకా నాలుగు పదుల వయసు కూడా రాలేదు. ఇంకా చాలా వయస్సు ఉంది. తాను మరొక ఐదు సంవత్సరాలు సినిమాలు చేసుకుని 2024 లో టిడిపి ఓడిపోతే అప్పుడు టీడీపీకి జూనియర్ తప్ప మరెవరు ఆదుకొనే నాయకుడు ఉండరు.

అప్పుడు పార్టీ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందర నిలబడుతుంది. నువ్వే పార్టీని కాపాడాలని పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఎన్టీఆర్ ని బలవంతం చేస్తారు. అప్పటికే పదేళ్ల పరిపాలన చేసిన జగన్ మీద అయన ప్రభుత్వం మీద కచ్చితంగా వ్యతిరేకత ఏర్పడుతుంది. దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ సినీ గ్లామర్ తోడైతే తన తాత గారి లాగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు తొందరపడి వైసీపీలో జాయిన్ అయితే అది ఇది తనకు జీవితాంతం ఒక బ్యాగేజిలా మిగిలిపోతుంది. ఆ బ్యాగేజ్ మోయాలని అటు జూనియర్ కి కానీ ఆయన సన్నిహితులకు కానీ ఆలోచన లేదట. కానీ రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు కాబట్టి ఇంకొన్నాళ్లు వెయిట్ చేస్తే జూనియర్ దారెటో తెలిసిపోతుంది.