జగన్ ను ప్రమోట్ చేస్తున్నారా ?

అవును చంద్రబాబునాయుడు వ్యవహారం చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. నిద్రపోయేటపుడు తప్ప మిగిలిన సమయంలో అవకాశం దొరికినా లేకపోతే దొరికించుకునైనా సరై జగన్ గురించే మాట్లాడుతున్నారు. ప్రొద్దున్నే నేతలతో టెలికాన్ఫరెన్సుతో మొదలవుతుంది చంద్రబాబు దినచర్య. దాదాపు గంటపాటు జరిగే టెలికాన్ఫరెన్సులో ఎక్కువ భాగం జగన్మోహన్ రెడ్డిని విమర్శించటానికో లేకపోతే ఆరోపణలు చేయటానికో సమయం అయిపోతుంది.

తర్వాత నేతలతో జిల్లాల వారీగా లేదా లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అప్పుడు కూడా జగన్ నామస్మరణే. నేతలతో మాట్లాడేటపుడు కూడా జగన్నే టార్గెట్ గా చేసుకుంటున్నారు. అయితే లోక్ సభ వారీగా నియోజకవర్గాల సమీక్షలతో సమయం గడచిపోతుంది. లేకపోతే ఏదో ఓ జిల్లా పర్యటనకు వెళుతున్నారు.

జిల్లాల్లో పర్యటనలకు వెళ్ళినపుడు కూడా మళ్ళీ జగన్, కెసియార్, మోడి పై ఆరోపణలు, విమర్శలతోనే కాలం గడిచిపోతోంది. తాజాగా ఐటి గ్రిడ్స్ డేటా స్కాం బయటపడింది. దాంతో గడచిన నాలుగు రోజులుగా జగన్ గురించి మాట్లాడటానికే చంద్రబాబుకు సమయం సరిపోవటం లేదు.

మధ్యలో కెసియార్, మోడి గురించి కూడా ప్రస్తావిస్తున్న ఎక్కువ భాగం జగన్ను తిట్టటానికే చంద్రబాబు సమయం కేటాయిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జగన్ విషయం చూస్తేనేమో బహిరంగసభల్లో తప్ప చంద్రబాబు గురించి మరెక్కడా మాట్లాడటం లేదు.  ఇపుడు చెప్పండి జగన్ను ఎంతలా చంద్రబాబు ప్రమోట్ చేస్తున్నారో.