ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలని అంటారు.. ఇదే క్రమంలో.. ఏ సీజన్ లో జరిగేది ఆ సీజన్ లో జరిగితేనే అందం, ఆనందం అని చెబుతారు.. ఆలా కాకుండా అన్ సీజన్ కూతలు కూయడం వల్ల జరిగే డ్యామేజ్ మరింత ఎక్కువగా ఉంటుందని.. ఫలితంగా మొదటికే మోసం వస్తుందని అంటుంటారు. తాజాగా టీడీపీ సీనియర్ పొలిటీషియన్, బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయనే చర్చ తాజాగా మొదలైంది.
అవును… ఏపీలో పరిపాలన, ‘సూపర్ సిక్స్’ అంటూ ఎన్నికలనాడు ఇచ్చిన హామీల అమలు, ప్రజల్లో రెండేళ్లలోనే ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందనే విమర్శలు, పలు కీలక హామీలపై ప్రభుత్వం దాటవేత ధోరణితో పాటు “రెడ్ బుక్” పేరు చెప్పి జరుగుతున్నాయంటున్న ఘోరాలు వెరసి… ఇప్పటికే కూటమి ప్రభుత్వం, లోకేష్ వ్యవహారశైలి, చంద్రబాబు పాలన, పవన్ అలసత్వం వంటి విషయాలపై తీవ్రమైన చర్చ జరుగుతుందని అంటున్నారు. ఈ సమయంలో మరింత డ్యామేజ్ చేసేలా బుచ్చయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టీడీపీ భవిష్యత్ నాయకులు నందమూరి వారు కాదని.. తన కుమారుడు నారా లోకేష్ మాత్రమే అని చంద్రబాబు ఇప్పటికే పరోక్షంగా పలుమార్లు వెళ్లడించిన సంగతి తెలిసిందే. తన బహిరంగ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ప్రదర్శించినా ఆయన నిప్పులు చెరిగిన సంఘటనలు తెలిసిన విషయమే. ఏదో విధంగా తన కుమారుడిని భవిష్యత్ లో తన స్థానంలో చూడాలని ఓ పక్క చంద్రబాబు భావిస్తుండగా.. మరోవైపు తనదైన ఆవేశంతో రెడ్ బుక్ పేరు చెప్పి లోకేష్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
వాటిని కవర్ చేసుకుంటూ, ఓ వర్గం మీడియాలో ఆ సంఘటనలు, దాని రియాక్షన్స్ కనిపించకుండా మేనేజ్ చేసుకుంటూ.. చంద్రబాబు ఓ పక్క లోకేష్ కోసం రోడ్డు వేసుకుంటూ వెళ్తుంటే… లోకేష్ పంథాలోనే తామూ ముందుకు పోతామన్నట్లుగా స్వర్గీయ నందమూరి తారకరామారావుతో కలిసి పనిచేసినవారు సైతం తమ వయసు, విజ్ఞత మరిచి.. విలువలు విడిచి అన్నట్లుగా చేస్తోన్న వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఈ సందర్భంగా… గతంలో పలువురు వైసీపీ నేతలు శృతిమించి చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, వాటిని అధినేత ఖండించినట్లు కనిపించని సంఘటనలు.. ఫలితంగా వచ్చిన ఫలితాలను పలువురు గుర్తుచేసుకుంటున్నారు! 2029లో టీడీపీ ఫ్యూచర్ కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే… ఇప్పటికే గుంటూరులో పెమ్మసాని పుణ్యమాని ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి మొదలైందని.. కమ్మ – కాపు మధ్య మరింత బలమైన గోడలు కట్టే రాజకీయం రాజుకుందని.. ఓట్లేసేటప్పుడు అంతా కావాలి కానీ, అధికారంలోకి వచ్చాక అంతా తామే అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉందని అంబటి రాంబాబు వంటి నేతలు బహిరంగంగా విమర్శిస్తూ ధ్వజమెత్తుతున్నారు. దీంతో… రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ కులాభిమానం, కులహంకారం, కుల విభజనపై చర్చ మొదలైంది.
మరోవైపు… టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలతో పాటు, కూటమి సభల్లోనూ… తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారంటూ జనసేన కార్యకర్తలు వాపోతున్నారనే ప్రచారమూ జరుగుతుంది. ఈ సమయంలో… అంబటి రాంబాబును ఉద్దేశించి బుచ్చయ్య చౌదరి.. “ఏంట్రా యదవల్లారా…..మేం తలచుకుంటే మిమ్మల్ని నరికేయగలం!” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీంతో.. వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతుందని అంటున్నారు.
తాజాగా.. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ రూరల్ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.. కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ రెచ్చిపోయారు.
ఇందులో భాగంగా… “ఏంట్రా యదవల్లారా మీరు నరికేది. మేమే నరకగలం. మాకు అధికారం ఉంది. మేం తలచుకుంటే మిమ్మల్ని నరికేయగలం.. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే అంబటి అయినా.. గిమ్మటి అయినా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు” అని వ్యాఖ్యానించారు. దీంతో… రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో వెర్రితలలు వేస్తోందో చెప్పడానికి బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యలే నిదర్శనమనే చర్చ బలంగా మొదలైందని అంటున్నారు.
మరోవైపు… ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ప్రొటెం స్పీకర్గా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన బుచ్చయ్యచౌదరి ఈ స్థాయిలో తెగించి దారుణమైన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమని అంటూనే… ఇవి పరోక్షంగా లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై నిప్పులు చల్లడమే అని అంటున్నారు.
అందుకు పలువురు చెబుతోన్న కారణాలు సైతం కాస్త ఆలోచించాల్సినవాటిగానే ఉన్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా… ఎంతో సీనియర్ అయిన తనకు చంద్రబాబు కావాలనే మంత్రి పదవి ఇవ్వలేదు, ఇవ్వడం లేదనే కోపంతో.. ఇక, లోకేష్ హయాంలో తనకు 2029లో ఎమ్మెల్యే టిక్కెట్ అయినా ఇస్తారా అనే సందేహంతో.. ఈ స్థాయిలో తన అనుభవాన్ని ఉపయోగించి బుచ్చయ్య ప్లాన్ చేశారా.. లోకేష్ పొలిటికల్ ఫ్యూచర్ కి వెన్నుపోటు పొడుస్తున్నారా.. అనే చర్చా తమ్ముళ్ల మధ్య జరుగుతుందని చెబుతున్నారు.
మరోవైపు… 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించిన కాపు సామాజికవర్గం క్రమక్రమంగా టీడీపీ, జనసేనలకు దూరం అయిపోతుందనే చర్చా జరుగుతుంది. పవన్ ను నమ్మి జెండా మోసిన సగటు జనసైనికుడికి గుర్తింపు లేదు సరికదా.. వారు ఇప్పటికీ టీడీపీ కార్యకర్తల వెనుకే నడవాల్సి వస్తోంది తప్ప, పక్కన నడిచే పరిస్థితులు లేవని చెబుతున్నారు.
అందుకు కారణం… పవన్ కల్యాణ్ తన పనేదో తాను చూసుకుంటున్నారే తప్ప, గ్రౌండ్ లెవెల్ లో సగటు కార్యకర్త, ద్వితీయ శ్రేణి నాయకుడి పరిస్థితి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని, అందుబాటులో ఉండటం లేదని అంటున్నారు!
అక్కడికే కాపు సామాజికవర్గానికి చెందిన సగటు జీవి మనోవేదనకు గురవుతుంటే… అగ్నికి ఆజ్యం పోసినట్లు గుంటూరులో పెమ్మసాని, రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి మొదలు రాష్ట్రవ్యాప్తంగా కాపులను కూటమిలో అణగదొక్కే చర్యలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయనే చర్చనూ తెరపైకి తెచ్చాయని చెబుతున్నారు.
ఈ విధంగా… లోకేష్ నాయకత్వంలోని టీడీపీలో కాపులను అణగదొక్కే కార్యక్రమం, వారిపై మరో సామాజికవర్గం బెదిరించడం, పెత్తనం చేయడం వంటి వైఖరి పెరుగుతోందనే చర్చ జరుగుతుండగా.. తాజాగా బుచ్చయ్య దానికి బలం చేకూర్చారని అంటున్నారు పరిశీలకులు.
ఏది ఏమైనా… తాజాగా బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యల వెనుక అసలు మర్మమేమిటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!!
