సంబరాల రాంబాబు ‘సందడి’పై కొత్త చర్చ వైరల్!

గత కొన్ని రోజులుగా అంబటి రాంబాబు గురించి అటు సోషల్ మీడియాలోనూ, ఇటు పొలిటికల్ సర్కిల్స్ తో పాటు జర్నలిస్టు సమాజం లోనూ ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రధానంగా.. గుంటూరు జిల్లా రాజకీయాల్లో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారారని చెప్పొచ్చు.

అందుకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి.. ఆయనకున్న సబ్జెక్ట్ కం వాక్ చాతుర్యంతో కూడిన దూకుడు, రెండోది.. తనది తప్పైతే వెంటనే బహిరంగంగా క్షమాపణ చెపగలిగేటంత సంస్కారం, హుందాతనం!

అవును… తెలుగు రాష్ట్రాల్లోని నేతల్లో అంబటి వాగ్ధాటికి ఒక ప్రత్యేకత ఉందని అంటారు రాజకీయ పరిశీలకులు. సబ్జెక్ట్ తో కూడిన స్వరంతో పాటు ఛలోక్తులు, అదుపు తప్పకుండా పంచులు, శృతిమించకుండా సెటైర్లు, గీత దాటకుండా గిచ్చుళ్లు ఆయన శైలి. ఇది రాజకీయ ప్రత్యర్థులకు మంట పుట్టించగా.. సొంత పార్టీ శ్రేణులకు మాత్రం సందడిగా ఉంటుందని అంటారు.

నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువగా టీవీ డిబేట్స్ లో పార్టీ అభిప్రాయాన్ని తనదైన వాక్ చాతుర్యంతో వెళ్లడిస్తూ, ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన అంబటి రాంబాబు… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా సక్సెస్ ఫుల్ గా పనిచేశారని అంటారు.

ఇక తాజాగా 2024 ఎన్నికల్లో మరోసారి ప్రతిపక్షానికి పరిమితమైన నేపథ్యంలో.. అసెంబ్లీలో గొంతు వినిపించే అవకాశం లేని తరుణంలో.. పైగా ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శలు బలంగా వినిపిస్తోన్న పరిస్థితుల్లో… అటు జనాల్లోనూ, ఇటు మైకుల ముందు అధికార పక్షాన్ని నిలదీస్తూ ఆయన చేస్తోన్న రాజకీయ సందడి సరికొత్త చర్చకు తెరలేపిందని చెబుతున్నారు.

గతంలో తిరుమ‌ల లడ్డూ వ్య‌వ‌హారం ఏపీ రాజకీయాల్లో ఎంత రచ్చగా మారిందో తెలిసిందే. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా.. ప్రభుత్వంలోని పెద్దలే భక్తుల మనోభావలతో ఆడుకుంటూ అన్నట్లుగా.. తెరపైకి వచ్చిన ఆరోపణలపై స్పష్టత రాకుండానే అల్లరి చేసేసిన పరిస్థితి! ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆలయాలను శుభ్రం చేసి, ప్రత్యేక పూజలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు మంచి బుద్ధి ప్ర‌సాదించాల‌ని కోరుతూ.. వైసీపీ నాయ‌కులు రాష్ట్రవ్యాప్తంగా ఆల‌యాల్లో ప్రత్యేక పూజ‌లు చేశారు. ఈ క్ర‌మంలో ఆ రోజు అంబ‌టి రాంబాబు కారును కొంతమంది టీడీపీ కార్యకర్తలు అడ్డ‌గించ‌డం.. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడం.. పోలీసులు చోద్యం చూస్తున్నట్లున్నారనే ఆరోపణలు వినిపించడం.. ఆ సమయంలో అంబటి కాస్త నోరు జారి ఆవేశంలో చంద్రబాబుపై దూషణకు దిగడం జరిగిపోయాయి.

అయితే… తన తప్పు తెలుసుకున్న అంబటి రాంబాబు… చంద్రబాబుపై తాను అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పే అంటూ క్షమాపణ కోరారు! దీంతో.. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలినవాడే అంబటి రాంబాబు అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. ఇదే సమయంలో… “ఈ క్షమాపణతో.. అంబటి రాంబాబు ఓ మెట్టు పైకి ఎక్కేశారు” అనే మాటలూ వినిపించాయి.

ఎందుకంటే… శరీరంలో వచ్చే రక్తపోటు ప్రభావమో.. లేక, ఆ సమయంలో సిట్యువేషన్ డిమాండో… కారణం ఏదైనా, కారకులు ఎవరైనా ఒక్కోసారి తప్పు జరగడం సహజమే. కాకపోతే.. ఆ తప్పు తెలుసుకుని, సరిదిద్ధుకోవడం కొంతమందికే సాధ్యమవుతుంది. ఈ బీపీ వల్ల అవతలి వ్యక్తి మనోభావాలు దెబ్బతింటే.. క్షమాపణలు చెప్పడం అతి తక్కువ మంది వల్లే అవుతుంది.. అందులో అంబటి ఒకరయ్యారు!

అయినప్పటికీ… అంబ‌టి రాంబాబు ఇంటిపై అత్యంత భయానకమైన రీతిలో దాడి జరగడం.. ఈ సమయంలో దాడి చేసినవారి బయటే స్వేచ్ఛగా తిరుగుతుండగా.. పోలీసులు బాధితుడైన అంబటిని అరెస్టు చేయ‌డం.. జైల్లో ఉంచ‌డం తెలిసిందే. దీంతో… దాడులకు పాల్పడిన వారిని వదిలేసి, బాధితుడిని జైల్లో పెట్టడంపై ఉండవల్లి అరుణ్ కుమార్ తో సహా పలువురు స్పందించారు. చంద్రబాబు కొత్త తరహా పాలన సాగిస్తున్నారని అన్నారు!

ఏది ఏమైనా… అటు చంద్రబాబుపై ఆవేశంలో ఒక మాట అన్నా.. ఆనాక క్షమాపణలు చెప్పడం.. హుందాగా ప్రవర్తించడంతో అంబటిపై చాలా మందికి గౌరవం పెరిగిందని అంటారు. ఇదే సమయంలో.. బాధితుడైన ఆయనను జైల్లో ఉంచడంతోపాటు స్టేషన్ లో ఆయనపై పోలీసులు వ్యవహరించారని చెబుతోన్న తీరుతో సానుభూతి పెరిగిందని చెబుతున్నారు.

ఇది అటు అంబటితో పాటు ఇటు వైసీపీకి ప్లస్ అయ్యిందని అంటున్నారు. ఇదే సమయంలో.. గుంటూరు జిల్లాలో క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారాయి.

ప్రధానంగా… అటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు తనపై దాడి చేయడం.. తన ఇంటిని, వాహనాలను ధ్వంసం చేయడం ఒకెత్తు అయితే… కేంద్రమంత్రి, టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ వ్యవహారశైలి.. గుంటూరులో కాపు వర్సెస్ కమ్మ అనే అంశాన్ని తెరపైకి బలంగా తెచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ఇది గుంటూరు ప్రజానికంలో ఓ సామాజికవర్గ ఆధిపత్యంపై చర్చను తెరపైకి తెచ్చిందని చెబుతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో… గుంటూరు క‌లెక్ట‌రేట్ వ‌ద్ద అంబ‌టి రాంబాబు నిరాహార దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్ష‌కు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపాయి. క‌స్ట‌డీలో త‌న‌ను హింసించిన పోలీసుల‌ను స‌స్పెండ్ చేయాల‌నేది ఆయ‌న ప్ర‌ధాన డిమాండ్‌. ఇదే సమయంలో.. త‌న ఇంటిపై దాడికి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ పెమ్మ‌సానే అని.. దానికి త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని అంబటి చేసిన హెచ్చ‌రికలు.. గుంటూరు జిల్లాలో పొలిటికల్ హీట్ ని పెంచాయి.

అక్కడితో అంబటి డిమాండ్లు, హెచ్చరికలు అయిపోలేదు. చంద్ర‌బాబు, నారా లోకేష్, పెమ్మ‌సాని ఆదేశాల‌తోనే తన ఇంటిపై దాడి జ‌రిగిందని.. ఇళ్ల‌పై దాడి చేసే సంస్కృతిని గుంటూరులో పెమ్మ‌సాని తీసుకొచ్చారని.. ఈ ముగ్గురినీ వ‌దిలి పెట్టే ప్ర‌సక్తే లేదని.. అదేవిధంగా, దాడికి పాల్ప‌డిన ఏ ఒక్క‌ర్నీ విడిచి పెట్టేది లేదని.. వారిని జైలుకు పంపించే వర‌కూ పోరాటం ఆగ‌దని అంబటి తీవ్రంగా హెచ్చరించారు. దీంతో.. ఈ హెచ్చరికలు మరింత చర్చనీయాంశంగా మారాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయమే ఏమిటంటే… చంద్రబాబును తాను ఆవేశంలో అన్న మాటకు అంబటి క్షమాపణ చెప్పారు. అది ఆవేశంలో, ఆ పరిస్థితుల నేపథ్యంలో జరిగిందని ఒప్పుకున్నారు! ఇది హుందాతనం!

కానీ… ఇళ్లపైకి జనాలను పంపి, ఇంటిపైనా వాహనాలపైనా దాడులు చేయించడంతో పాటు.. దాడికి పాల్పడిన వారిని కాదని, బాధితుడిని అరెస్ట్ చేయడం వంటి విషయాల్లో ప్రభుత్వ వైఖరి.. దీనిపై రాంబాబు తాజా హెచ్చరికలు రాజకీయంగా ఆయనను మరో మెట్టు ఎక్కించాయని చెబుతున్నారు.

ఏది ఏమైనా… అధికారంలో ఉన్నప్పుడు అంతా మాట్లాడేవారే కానీ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నిజమైన పోరాటం చూపించాలని.. అది అంబటి రాంబాబు తనదైన శైలిలో కనబరుస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఈ విధంగా… రాజధాని ప్రాంతంలో రాజకీయాన్ని ఓ రేంజ్ లో వేడెక్కిస్తున్నారని చెబుతున్నారు. మరి ఈ దాటికి పెమ్మసాని & కో ఏ మేరకు నిలబడగలుగుతారనేది వేచి చూడాలి.