ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. మాజీ ఐపీఎస్ అధికారి ఆలూరి బాల వెంకటేశ్వరరావు (ఏబీవీ) రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు అధికారికంగా ప్రకటించారు. కోనసీమ జిల్లాలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆయన, “ఇప్పటికే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా” అని స్పష్టం చేశారు. “జగన్ భరతం పట్టేందుకే నా రాజకీయ ప్రవేశం. నేను ఎలాంటి పదవులు కోరటం లేదు. మెరుగైన సమాజం కోసం ప్రజల అండతో ముందుకు సాగాలనుకుంటున్నా” అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.
ఐపీఎస్ అధికారిగా వుండగా జగన్ ప్రభుత్వ హయాంలో అన్యాయంగా సస్పెండ్ చేసిన వాస్తవాలను గుర్తు చేసిన ఏబీవీ, “అందుకే ఆయనను ప్రశ్నించేందుకు ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు వస్తున్నా” అని చెప్పారు. ఇప్పటికే ఆయనను చంద్రబాబు ప్రభుత్వం సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. ఆపై, వైసీపీ హయాంలో సస్పెండ్ అయిన కాలానికి గానూ ప్రభుత్వ ఉద్యోగ బకాయిలు కూడా వడ్డీతో చెల్లించిన ఘట్టం గమనార్హం.
ఈ సందర్బంగా ఠాణేలంక గ్రామంలో కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన ఏబీవీ, “జగన్కు కోడికత్తి వేయించిన వ్యక్తిగా శ్రీను ప్రచారంలోకి వచ్చాడు. కానీ వాస్తవాలు అందరికీ తెలియవు. ఇలాంటి బాధితుల సంఖ్య వందల్లో, వేలల్లో ఉంటుంది. వారికి గళమిస్తా, అండగా ఉంటా” అన్నారు. ప్రజల నుంచి జగన్పై వచ్చిన సమాచారం కోసం 7816020048 అనే ప్రత్యేక వాట్సాప్ నంబర్ కూడా ప్రకటించారు. సమాచారం పంపేవారిని గోప్యంగా ఉంచుతానని భరోసా ఇచ్చారు.
తన రాజకీయ ప్రస్థానం ఏ పార్టీకి చెందుతుందన్న విషయాన్ని త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. అయితే ఆయన వ్యాఖ్యలు జగన్ శిబిరాన్ని తీవ్రంగా కలవరపరిచాయి. గతంలో పోలీసు అధికారిగా కఠినంగా వ్యవహరించిన ఏబీవీ ఇప్పుడు ప్రజానాయకుడిగా రాజకీయాల్లో అడుగుపెడుతుండడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్పై పోరాటానికి మరో గళం కలిసినట్లేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.