శ్రవణ్ దాసోజుకు ఖైరతాబాద్ టికెట్ ఎలా వచ్చిందంటే…

తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి ప్రొఫెసర్ శ్రవణ్ దాసోజుకు అసెంబ్లీ టికెట్ కేటాయించారు. ఆయన ప్రతిష్టాత్మకమయిన ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారు. చివరి దాకా ఆయన టికెట్ మీద ఉత్కంఠ ఉండింది.

సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెంది ఉండటం, దానికి తోడు పెద్దగా జనాభా లేని అవుసలి కులానికి చెంది ఉండటం వల్ల ఆయనకు టికెట్ వస్తుందా రాదా అనేది సస్పెన్స్ ఉండింది. రాజకీయ పార్టీలలో పెద్దగా దొరకని విజ్ఞానం, మంచి కంఠం, పరిశోధనాత్మక దృక్ఫథం, బోధనా వృత్తి అనుభవం దండిగా ఉన్న యువనాయకుడు దాసోజు.

అయితే, ఆయనకు రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోవడం వల్ల గతంలో టిఆర్ ఎస్ లో అవమానపడ్డారని చెబుతారు. పంచాయతీనుంచి పార్లమెంటు దాకా  నియోజకవర్గాలన్నీ దాదాపు కుటుంబాల సంస్థానాలు అయిపోతున్న ఈ రోజుల్లో పెద్ద చదవు, జ్ఞానము క్వాలిఫికేషన్లు కావు. రాజకీయపార్టీలలో బతకాలంటే ఉన్నత కులం ఉండాలి. రాజకీయ అండ ఉండాలి. లేదా పిచ్చి పిచ్చిగా డబ్బుండాలి. ఇవి లేని దాసోజు టిఆర్ ఎస్ లో టికెట్ ఆశించి భంగపడ్డాడు. నీకులానికి ఓట్లే లేవు నువ్వు ఎలా గెలుస్తావని 2014 ఎన్నికలపుడు కెసియార్ దాసోజును అవమానపర్చాడని, అందుకే ఆయన టిఆర్ ఎస్ కు గుడ్ బై కొట్టి కాంగ్రెస్ లో చేరాడని చెబుతారు.

కాంగ్రెస్ లో కూడా ఆయనకు కులం సమస్య ఎదురయిందని చెబుతారు.  అక్కడ కూడా ఇమడలేని పరిస్థితులొచ్చాయి. అయితే, ఆయన మరొక పార్టీలోకి పోదల్చుకోలేదు. ఎపుడో ఒకసారి స్థానిక నేతలనుంచి కాకపోయినా ఢిల్లీ నుంచి గుర్తింపు వచ్చినపుడు స్థానిక పాలెగాళ్లు తప్పుకుని కొంత జాగా తనకిస్తారనే ఆశతో ఆయన కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని నిజాయితీగా కష్టపడ్డారు. ఆశించినట్లే ఆయనను ఢిల్లీ గుర్తించింది. అనర్ఘళంగా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మాట్లాడగలిగే వాడు పార్టీలో ఎవరూ లేరని, దాసోజు ఒక్కరే నని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఈ అభిప్రాయం రాష్ట్ర నాయకులు అంగీకరించక తప్పలేదు.

టిఆర్ ఎస్ కు బలమయిన ప్రచార యంత్రాంగాన్ని తిప్పికొట్టేలా కాంగ్రెస్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు రూపొందించి ఇచ్చింది ఆయనే. ఇరిగేషన్ ప్రాజక్టుల మీద ఎంతోశోధించి టిఆర్ ఎస్ చెబుతున్నవన్నీ ఫేక్  అని  చెప్పిందాయనే. ఇలా కాంగ్రెస్ నుంచి టిఆర్ ఎస్ కు ధీటైన కౌంటర్ ఇస్తూ వస్తున్నది దాసోజే. ఆయన టిఆర్ ఎస్ ను ఇరుకున పెట్టని రోజు లేదు. సాధారణంగా బిసిలు, దళిత నేతలు టిఆర్ ఎస్ మీద, ముఖ్యంగా కెసియార్, ఆయన కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేసేందుకు జంకుతారు. ఈ కులాలల్లో రాజకీయ భీతి ఎక్కువగా ఉంటుంది. దానిని అధిగమించి, ధీటైన భాషలో టిఆర్ ఎస్ త్రిమూర్తులకు (కెసియార్, హరీష్, కెటియార్) ధీటైన సమాధానం ఇవ్వడమే కాదు, సవాళ్లు, ప్రతిసవాళ్లు విసిరిన ఏకైక బిసి నాయకుడు దాసోజే. రాజకీయ సొల్లు కాకుండా కచ్చితమయిన ఆధారాలతో విమర్శలు చేసింది దాసోజే.

అయినా సరే ఆయనకు పార్టీలో  తగిన గుర్తింపు రాలేదు. కారణం చిన్నదే.. కులం. టిఆర్ ఎస్ ను దొరల పార్టీ అని విమర్శించినా తెలంగాణ కాంగ్రెస్ కు కులముంది. ఆ కులమేదో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అదే దాసోజు ను చివరి దాకా టెన్షన్ లో పెట్టింది. అయినా సరే, ఆయనను గుర్తించక తప్పలేదు, బుధవారం నాడు విడుదల చేసిన రెండో జాబితాలో ఆయన పేరు చేర్చక తప్పలేదు. రెండో జాబితా ఇదే.

కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన రెండో జాబితా ఇది

ఖానాపూర్‌ (ఎస్టీ): రమేష్‌ రాథోడ్‌
ఎల్లారెడ్డి :జాజల సురేందర్‌
ధర్మపురి (ఎస్సీ): అదూరి లక్ష్మణ్‌ కుమార్‌
సిరిసిల్ల కేకే మహేందర్‌ రెడ్డి
మేడ్చల్‌: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
ఖైరతాబాద్‌: దాసోజు శ్రవణ్‌
జూబ్లీహిల్స్‌: పి విష్ణువర్ధన్‌ రెడ్డి
షాద్‌నగర్‌ : సి ప్రతాప్‌రెడ్డి
భూపాలపల్లి : గండ్ర వెంకట రమణారెడ్డి
పాలేరు : కాందాల ఉపేందర్‌రెడ్డి