Anna Canteens: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘అన్న క్యాంటీన్ల’ (Anna Canteens) నెట్వర్క్ మరింత విస్తరించనుంది. ఇప్పటివరకు పట్టణాలు, నగరాలకే పరిమితమైన ఈ సేవలు నేటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. బుధవారం (ఏప్రిల్ 15) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలోని ధరణికోటలో కొత్త క్యాంటీన్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 62 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 207 క్యాంటీన్లు నడుస్తుండగా, ఈ కొత్త వాటితో కలిపి మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కి చేరనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభోత్సవం అనంతరం సామాన్య ప్రజలతో కలిసి భోజనం చేయనున్నారు. పేదల ఆకలి తీర్చడమే ధ్యేయంగా రూ. 5 లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్న ఈ పథకం అద్భుతమైన స్పందనను పొందుతోంది.

గతంలో (2014-19) ప్రారంభమైన ఈ పథకం, గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని పునరుద్ధరించింది.
“రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదన్నదే ప్రభుత్వ సంకల్పం. కొత్తగా ప్రారంభించే 62 గ్రామీణ క్యాంటీన్ల కోసం ఏడాదికి రూ. 58 కోట్ల అదనపు సబ్సిడీని ప్రభుత్వం భరించనుంది.”
ప్రస్తుతం విస్తరిస్తున్న ఈ సేవలపై ప్రజల స్పందనను బట్టి, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పట్టణ ప్రాంతాల తరహాలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

