ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. విదేశాలో ఉన్న తన కుమార్తెలతో కొన్ని రోజులు గడిపి రావడం కోసం ఆయన ప్రయాణమై వెళ్లారు! దీంతో… ఓ వర్గం మీడియాలో పలు కథనాలు, టీడీపీ సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు దర్శనమిచ్చాయి. వాటన్నింటి సారాంశం ఏమిటంటే… “జగన్ విదేశాలకు వెళ్లిపోయారు.. ఇక వైసీపీ సైలంట్ మోడ్ లోకి వెళ్లిపోతుంది” అని!
సాధారణంగా… ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ అనే ప్రచారం జరుగుతుంది. ఆయన స్థానికంగా ఉండి, యాక్టివ్ గా ఉంటేనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు యాక్టివ్ గా ఉంటారని.. ఆయన ఏ బెంగళూరులో, విదేశీ పర్యటనకో వెళ్తే.. వాళ్లు కూడా ఆఫ్ లైన్ మోడ్ లోకి వెళ్లిపోతారనే ఆరోపణా ఉంది! అయితే.. “అది గతం..!” అనే విషయం తాజాగా తేటతెల్లమైంది.
వ్యక్తిగత పర్యటనలో భాగంగా విదేశాల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర సమస్యపై జగన్ వెంటనే స్పందిస్తున్నారు.. ప్రభుత్వ వ్యవహారశైలిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే సమయంలో… పార్టీ అధినేత జగన్ దేశం బయట ఉన్నప్పటికీ.. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ తమ పాత్రలు పక్కాగా పోషిస్తూ, ప్రజల తరుపున పోరాడుతున్నారు.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు!
వివరాళ్లోకి వెళ్తే… ప్రస్తుతం ఏపీలో అన్ని పెట్రోల్ బంకులలో అతి పెద్ద క్యూలు దర్శనం ఇస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు అల్లల్లాడుతున్నారు. పంట చేతికొచ్చిన ఆనందంలో ఉన్న రైతులు.. అవి కోసే కోత యంత్రాలకు డీజిల్ అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
చెరువుల్లోని రొయ్యలు పెరుగుతున్న వేళ వాటికి ఆక్సిజన్ అందించేందుకు ఏరియేటర్లను ఉపయోగించాల్సి ఉండగా.. తాజా పరిణామాలతో ఆక్వారైతులు టెన్షన్ పడిపోతున్నారు.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని సమస్య చుట్టుముట్టడంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో వైసీపీ అధినేత జగన్ విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో.. తమ తరుపున ఎవరు పోరాడతారు, తమ తరుపున ప్రభుత్వాన్ని ఎవరు నిలదీస్తారు, తమ బాధలను ఎవరు అర్ధం చేసుకుంటారు అనే ఆలోచన ప్రజల్లో వ్యక్తమైందని అంటున్నారు.
అయితే.. “నేను ఎక్కడున్నా, నా అనుకున్న వాళ్లు ఎప్పుడూ నా ఆలోచనల్లోనే ఉంటారు” అన్నట్లుగా జగన్ ఆన్ లైన్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా… చంద్రబాబును గట్టిగా నిలదీశారు.
ఇందులో భాగంగా… పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. సరఫరాలో సంక్షోభం లేదు.. కానీ, ఏపీలో మాత్రం డీలర్లు, కూటమి నాయకులు కుమ్మక్కవడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందంటూ జగన్ విమర్శించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు.. పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేస్తున్నారని.. వారితో కూటమి నాయకులు జత కట్టారని.. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారని.. పైకి మాత్రం… సరఫరా మరింత తగ్గుతుందన్న భయంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నందువల్ల కొరత ఏర్పడిందని కుంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా.. “వాస్తవం ఏమిటో మీక్కూడా తెలుసు చంద్రబాబు.. అందుకే పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై సమగ్రమైన రివ్యూ కూడా చేయకుండా, కేవలం లీకులతో సరి పెడుతున్నారు” అని జగన్ కుండబద్దలు కొట్టారు! ఈ కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోందని తెలిపారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు చంద్రబాబూ అంటూ జగన్ హెచ్చరించారు.
వైసీపీ క్విక్ రియాక్షన్!:
రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా… విదేశాల్లో ఉన్న మంత్రులు, నిన్నటివరకూ ఎక్కడున్నారో తెలియకుండా ఉన్న లోకేష్ వంటి వారు ఈ సమస్యలపై తమకేమీ పట్టనట్లుగా ఉన్నారని.. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వంలో ఉన్న వారు అలా ప్రవర్తిస్తుంటే… విదేశాల్లో ఉన్న ప్రతిపక్ష నేత జగన్ మాత్రం ఎక్స్ వేదికగా స్పందించారు. అంతకంటే ముందే.. రాష్ట్రంలోని దాదాపు ప్రతీ నియోజకవర్గంలోనూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సమస్యపై వేగంగా స్పందించారు.
ఈ క్రమంలో… నేరుగా పెట్రోల్ బంకుల వద్దకే వెళ్లిన వైసీపీ నాయకులు.. వినియోగదారులతో మాట్లాడారు. సమస్య తీవ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ఇదే సమయంలో… గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద క్యూలలో ఉన్న వాహనదారులకు మంచినీళ్లు, మజ్జిగ వంటివి సైతం వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందించారు!
మరికొంతమంది ప్రజలు, వైసీపీ కార్యకర్తలు… తాజా పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి లోనై… టీడీపీ పార్టీ గుర్తు సైకిల్ ను నడి రోడ్డుపై పడేసి తొక్కుతున్నారు. ప్రభుత్వంపై వారి ఆగ్రహాన్ని ఈ విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు! ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, ఇప్పుడు జరుగుతున్నదానికీ ఏమైనా సంబంధం ఉందా అని నిలదీస్తున్నారు!
ఈ సందర్భంగా… చంద్రబాబు అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్ ల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయని చెప్పారు. పబ్లిసిటీ స్టంట్ మాస్టర్ నడుపుతున్న ఈ ప్రభుత్వంలో ప్రచారం తప్ప పని కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంధన కొరతతో అల్లాడుతుంటే.. ప్రభుత్వం మాత్రం ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. దేశంలో ఈ సమస్య ఎక్కడా లేదని.. కేవలం టీడీపీ కూటమి అధికారంలో ఉన్న ఏపీలో మాత్రమే ఈ దుస్థితి నెలకొందని మండిపడ్డారు. ఈ సమస్యకు కచ్చితంగా కూటమి ప్రభుత్వ చేతకానితనమే కారణమని ఫైర్ అయ్యారు.
ఇదే సమయంలో… గతంలో ఇండిగో విమానాలు ఆగిపోతే తనకే మాత్రం సంబంధం లేకున్నప్పటికీ.. రాష్ట్ర మంత్రి లోకేష్ సమీక్షించాడని తమ అనుకూల మీడియాలో ఊదరగొట్టారని… కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇంధన కొరత గురించి మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని… నాడు విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని సమస్యపై రాష్ట్ర మంత్రి లోకేష్ సమీక్ష సంగతి అలా ఉంటే… రాష్ట్రంలోని సమస్య తిపై ఈ మౌనం ఎందుకని నిలదీశారు.
ఇదే క్రమంలో… తుపాన్ ను సైతం తప్పించానని చెప్పుకునే చంద్రబాబు.. పక్కనే ఉన్న హెచ్.పీ.సీ.ఎల్, ఐ.వో.సీ.ఎల్ నుంచి పెట్రోల్, డీజిల్ తెప్పించలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు.
కూటమి పాలనలో యూరియా కోసం రైతులు.. పింఛన్ కోసం వృద్ధులు, వింతతువులు, వికలాంగులు.. రేషన్ కోసం మహిళలు.. గ్యాస్ కోసం ప్రజలు క్యూల్లో నిల్చుంటున్నారని.. ఆ క్యూల సమీపానికి చంద్రబాబు, లోకేష్ లు వెళ్తే.. ప్రజలు వీరి పాలనలో ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలియడంతో పాటు.. వారు ఏ విధంగా బూతులు తిడుతున్నారో కూడా తెలుస్తుందని దుయ్యబట్టారు.
ఏది ఏమైనా… జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడంతో రాష్ట్రంలో వైసీపీ సైలంట్ మోడ్ లోకి వెళ్లిపోతుందంటూ ఓ వర్గం మీడియా, టీడీపీ సోషల్ మీడియా జనాలు వ్యాఖ్యానిస్తోన్న వేళ… దేశం ఆవల ఉన్నప్పటికీ జగన్ ఆన్ లైన్ వేదికగా స్పందించారు. తాజా పరిణామలపై చంద్రబాబును నిలదిస్తూ, అల్టిమేటం జారీ చేశారు!
ఇదే సమయంలో… రాష్ట్రంలోని దాదాపు ప్రతీ నియోజకవర్గంలోనూ వైసీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతూ.. ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు.. పెట్రోల్ బంకుల వద్ద ఎండలో క్యూలో గంటలు తరబడి నిల్చున్న ప్రజలకు చల్లని త్రాగునీరు, మజ్జిగ ఇచ్చి కొంత సాంత్వనం కలిగిస్తున్నారు!
దీంతో… వైసీపీ నాట్ ఇన్ సైలంట్ మోడ్, ఆల్ వేస్ ఆన్ యాక్టివ్ మోడ్ ఫర్ పీపుల్ అనే కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు!
