తిరుపతి నుంచి టిడిపి రెండో జాబితా ప్రకటన

రాబోయే ఎన్నికలకు చంద్రబాబునాయుడు శంఖారావం పూరించనున్నారు. తన శంఖారావాన్ని పూరించేందుకు చంద్రబాబు కుటుంబ సమేతంగా అమరావతి నుండి తిరుపతికి చేరుకున్నారు. ప్రతీ ఎన్నికకు ముందు చంద్రబాబు తిరుమల శ్రీనివాసుని ఆశీస్సులు తీసుకోవటం అందరికీ తెలిసిందే. ఇపుడు కూడా అందుకే భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ తో కలిసి తిరుపతి చేరుకున్నారు.

అమారవతిలో హెలికాప్టర్లోకి ఎక్కేముందు చంద్రబాబుకు భార్య భువనేశ్వరి సంప్రదాయబద్దంగా హారతిచ్చి వీర తిలకం దిద్దారు. ఎన్నికల్లో విజయాన్ని కాంక్షిస్తు దిష్టి తీసిన తర్వాత హారతిచ్చారు. తిరుపతి నుండి తిరుమల చేరుకుని స్వామివారి దర్శనం తర్వాత మళ్ళీ తిరుపతికి చేరుకుని బహిరంగసభలో ప్రసంగిస్తారు.

తిరుపతి సభలోనే చంద్రబాబు రెండోజాబితాను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇందులో 25 లోక్ సభ అభ్యర్ధులతొ పాటు 49 మంది ఎంఎల్ఏ అభ్యర్ధుల రెండో జాబితా ఉండబోతోంది. తిరుపతి సభ తర్వాత శ్రీకాకుళంకు వెళతారు. అక్కడ కూడా బహిరంగ సభలో పాల్గొని తిరిగి అమరావతికి చేరుకుంటారు.