శ్రీకాళహస్తిలో బొజ్జలకు ఎదురుగాలి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తిలో టిడిపికి ఎదురుగాలి వీస్తున్నట్లు సమాచారం. ఇక్కడ అధికార పార్టీ తరపున బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సుధీర్ అంటే మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పుత్రరత్నంమే లేండి. ఇక వైసిపి తరపున పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన బియ్యపు మధూసూధనరెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరూ కాకుండా జనసేన, బిజెపి తరపున కూడా అభ్యర్ధులున్నారు.

సుధీర్ విషయం తీసుకుంటే, వ్యక్తిగతంగా కుటుంబంపై పార్టీలో బాగా వ్యతిరేకత వచ్చేసింది. దానికితోడు ప్రభుత్వంపైన ప్రజా వ్యతిరేకత బోనస్. బొజ్జల మంత్రిగా ఉన్నపుడే ఆయన తరపున భార్య భాగ్యమ్మ, కొడుకు సుధీర్ నియోజకవర్గంలో చక్రం తిప్పేవారు. దాంతో అందరికీ వీళ్ళపై వ్యతిరేకత మొదలైపోయింది. ప్రతీ పనికీ ఇంత అని పర్సంటేజ్ తీసుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.

అదే సమయంలో గడచిన మూడేళ్ళుగా శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టుబోర్డు ఖాళీగా ఉంచేశారు.  ట్రస్టుబోర్డు ఛైర్మన్ , సభ్యులుగా చాలామంది ప్రయత్నించినా మంత్రి కుటుబం ఎవరికీ పడనీయలేదు. బొజ్జల సిఫారసు చేయలేదు కాబట్టి ముఖ్యమంత్రి కూడా స్వతంత్రించి ఎవరిని నియమించలేదు. ఇలాంటి ఘటనలతోనే నేతల్లో బొజ్జల కుటుంబంపై వ్యతిరేకత పెరిగిపోయింది. సుధీర్ కు టికెట్ ఇవ్వటం చంద్రబాబుకే ఇష్టం లేదట.

టికెట్ కోసం మాజీ ఎంఎల్ఏ ఎస్సీవి నాయుడు గట్టిగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బొజ్జలపై వ్యతిరేకత వల్ల ఎస్సీవి నాయుడు, శాంతారామ్ పవార్ తదితరులు ఎవరూ ప్రచారంలో సహకరించటం లేదట. సుధీర్ కు టికెట్ ఇచ్చేటపుడు చంద్రబాబు కూడా అందరినీ పిలిచి సర్దుబాటు చయకపోవటం కూడా మైనస్సయింది. అదే సమయంలో వైసిపి క్యాండిడేట్ బియ్యపు పై అందరిలోను సానుకూలత కనబడుతోంది. చూడబోతే టిడిపి నేతలే వైసిపి అభ్యర్ధి గెలుపుకు సహకరించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇన్ సైడ్ టాక్.