కూటమికి బిగ్ టాస్క్… రఘురామా మజాకా..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ శాసనసభ ఉప సభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు గురించి పరిచయం లేనివారు చాలా తక్కువని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఆయన రాజకీయాల్లో ఓ విభిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తుంటారని అంటారు. ప్రధానంగా స్వపక్షంలో విపక్ష పాత్ర సక్సెస్ ఫుల్ గా పోషిస్తారని.. 2019 ఎన్నికల అనంతరం వైసీపీ ఎంపీగా ఆయన చేసిన తనదైన రాజకీయం అందుకు ఓ ఉదాహరణ అని అంటారు.

కట్ చేస్తే… ప్రస్తుతం ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా, ఏపీ అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్ గా ఉన్న రఘురామ కృష్ణంరాజు… గత కొన్ని రోజులుగా మతపరమైన అంశాల విషయంలో మీడియాలో నానుతున్నారు. రామాలయం నిర్మాణం, చర్చిల నిర్మూలన అన్నట్లుగా సాగుతుందని చెబుతోన్న ఆయన వ్యవహార శైలి మతాల మధ్య వైషమ్యాలు మరింతగా పెంచే విధంగా ఉన్నాయనే అభిప్రాయం కలిగిస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

వివరాళ్లోకి వెళ్తే… ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సంబంధించి వివాదం గత కొంతకాలంగా సాగుతున్నట్లుగా ఉంది. కొంతమంది పునర్మించాలని అంటే.. కాదు, గొంతెనమ్మ ఆలయం నిర్మించాలని మరికొంతమంది అంటున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో.. ఇటీవల ఆ రామాలయానికి వెళ్ళినప్పుడు రఘురామను స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాస్త ఘర్షణ వాతావరణం చెలరేగే ప్రయత్నం జరగ్గా.. పోలీసులు పరిస్థితిని సద్దుమణిగించారు!

అనంతరం… ఆకివీడులో రామాలయాన్ని ఎట్టి పరిస్థితులలోనూ పునర్‌ నిర్మిస్తామని చెప్పిన రఘురామ… స్థపతి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారని అంటున్నారు. ఇదేసమయంలో… ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలనుకునేవారు రూ.100 నుంచి రూ.10 వేల వరకూ విరాళాలు అందించవచ్చని ఇప్పటికే విరాళాల సేకరణ కూడా ప్రారంభించారని సమాచారం.

ఇలా జరిగిపోతే ఇక విచిత్రం ఏముంది.. రఘురామ ప్రత్యేకత ఏముంది..? ఈ గ్యాప్ లో… రామాలయం వివాదం నడుస్తున్న ఆకివీడు మండలంలోనే 113 అనుమతుల్లేని చర్చిలు ఉన్నాయని చెబుతూ… ఆ చర్చిలకు 4లక్షల మంది వస్తారని.. కొందరికి అవి నాలుగు లక్షల ఓట్లుగా కనిపిస్తాయని రఘురామ ఎద్దేవా చేస్తున్నారు. దీంతో… రామాలయానికి వెళ్లినప్పుడు తనను అడ్డుకున్నారనే కోపంతో చర్చిలను ఈ వివాదంలోకి లాగుతూ.. మతాల మధ్య విద్వేషాలు పెంచేలాగా మాట్లాడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ సమయంలో… దళితులు, మైనారిటీలు, క్రైస్తవులను పూర్తిగా కూటమి ప్రభుత్వానికి దూరం చేసేలా రఘురామ చర్యలకు ఉపక్రమించారనే చర్చా ఊపందుకుంది. పైగా ఈ విషయంలో రఘురామను చంద్రబాబు సైతం కంట్రోల్ చేయలేకపోతున్నారా.. లేక, పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అందుకూ ఓ బలమైన కారణం ఉంది.!

అదేమిటంటే… 1932 నుంచి ఉన్న రామాలయం స్థానంలో కొత్తది కట్టేందుకు అనుమతులు లేవంటున్నారనేది రఘురామ ఆక్షేపణతో కూడిన ఆరోపణ. గతం సంగతి కాసేపు పక్కనపెడితే.. రఘురామ చెబుతున్నదే నిజం అయితే.. అది ఆయనకు పెద్ద విషయం కాకపోవచ్చు. అధికారంలో ఉన్న పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయనకు.. రామాలయ నిర్మాణానికి అనుమతులు తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. కాకపోతే… రామలయ నిర్మాణానికీ.. చర్చిల నిర్మూళనకు ముడిపెట్టడమే సమస్య అని అంటున్నారు!

ఈ క్రమంలో… ఈ రామాలయ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా… ప్రభుత్వ అనుమతి లేకుండా ఆకివీడులో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఆకివీడులో నిర్మాణం లేదా కూల్చివేత.. ఎలాంటి పనులైనా సరే ప్రభుత్వ అనుమతితోనే జరగాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.

దీంతో… ఆకివీడులో మొదలైన రామాలయ నిర్మాణం వ్యవహారం బంతి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కోర్టులో పడినట్లయ్యిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో… రఘురామ కోరుతున్నట్లు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందా.. అప్పటివరకూ ఈ నిర్మాణం కోసం రఘురామ చేస్తోన్న ప్రయత్నాలను ఆపుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఈ పరిణామాలతో… గోటితోపోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నట్లున్నారనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.