చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన బాలయ్య… జగన్ పై ఫైర్!

ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో ఏ1 నిందితుడు అయిన టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వైద్యపరీక్షలు చేయించిన అనంతరం నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు! ఈ సమయంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పలువురు టీడీపీ నేతలను ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు.

మరోపక్క తన తండ్రిని చూడటానికి వెల్లనివ్వడం లేదంటూ నారా లోకేష్ నిరసనకు దిగారు. శాంతిబధ్రతల సమస్య వస్తుందని క్లియర్ గా చెప్పిన పోలీసులు… రాజోలులోని పొదలాడలో ఉన్న యువగళం క్యాంప్ సైట్ లో లోకెష్ ను నిలిపేశారు! ఈ సమయ్యంలో నందమూరి బాలకృష్ణ స్పందించారు.

టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయంపై హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. జగన్ పాలకుడు కాదు కక్ష్యదారుడు అంటూ రుసరుసలాడారు! చంద్రబాబు నాయుడుది అక్రమ అరెస్టు అని, ఇలాంటి పనికి పూనుకోవడం దుర్మార్గం అంటూ ఫైరయ్యారు! అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నం తినటం మానేసి, కోర్టుల చేత చివాట్లు మాత్రమే తింటున్నారని కామెంట్ చేసిన బాలయ్య… జగన్ జీవిత లక్ష్యమేమిటో తనకు తెలుసని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా… తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి, చంద్రబాబుని కనీసం 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ఆ మేరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బాలయ్య మండిపడ్డారు.

2021 డిసెంబర్ 19లో ఎఫ్‌ఐఆర్ నమోదైంతే ఇంతవరకు ఎందుకు చార్జ్ సీటు వేయలేదని తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. సుమారు రెండు లక్షల మంది విద్యార్దులకు శిక్షణ ఇచ్చి, 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ ని కుంభకోణం అని ఏ విధంగా అంటారని కోర్టు ప్రశ్నించలేదా అంటూ బాలయ్య మండిపడ్డారు.

ఇదే సమయంలో… ఎలాంటి అవినీతి లేనటువంటి ఈ కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని, అంతకు మించి మరొకటి కాదని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని.. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని బాలకృ‌ష్ణ తెలిపారు.