నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి నెలాఖరులోపు 14 నోటిఫికేషన్లతో 1500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ కుమార్ ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్ లో ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి 31నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. 21 నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 3250 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.

తాము విడుదల చేసిన నోటిఫికేషన్లలోనే స్క్రీనింగ్‌ టెస్ట్‌, మెయిన్స్‌ పరీక్షల తేదీలతో పాటు ఖాళీల వివరాలను సైతం తెలిపామన్నారు. గతంలో కంటే భిన్నంగా క్యారీ ఫార్వర్డ్‌ పోస్టుల వివరాలతో సహా పొందుపరిచామని వివరించారు.

గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు 47,001 దరఖాస్తులు, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఉద్యోగాలకు 16,130, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు 5411, హార్టికల్చర్‌ అధికారి ఉద్యోగాలకు 1307 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మిగతా నోటిఫికేషన్లకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.

పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఈ నెల 19 వరకు దరఖాస్తులకు గడువు ఉందని ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలకు మొత్తం 56,621 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అభ్యర్థులు చివరి నిమిషంలో దరఖాస్తులు చేస్తుండటం వల్ల సర్వర్‌లో సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. వీలైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఎక్కువగా ఓటీపీఆర్‌ సంబంధిత ఇబ్బందులే వస్తున్నాయని, వారికి ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు కూడా విడుదల చేస్తామని ఉదయ్ కుమార్ వెల్లడించారు.