త్వరలోనే టిడిపికి గుడ్ బై చెప్పనున్న ఏపీ మాజీ మంత్రి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో సాగిన పార్టీ మార్పులు ఇప్పుడు ఏపీలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. నాలుగు నెలల్లోనే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో వివిధ పార్టీల కీలక నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీల మార్పు పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. టిడిపి లో కీలకంగా వ్యవహరిస్తున్న నేతకు స్వంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత  వస్తుండడంతో అసంతృప్తితో పార్టీ మారాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నేత, ఏమా కథ తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే.

నెల్లూరు జిల్లా రాజకీయ ఉద్దండులకు పేరుగాంచినది. నెల్లూరు జిల్లాకు చెందిన అనేక మంది నేతలు కీలక పదవులు చేపట్టి దేశ రాజకీయాలలో మార్పులు తీసుకువచ్చారు. మరికొంత మంది రాష్ట్ర రాజకీయాలలో తమ మార్కును చూపించారు. అందులో ఒకరు ఆదాల ప్రభాకర్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం హయాంలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్లీ ఆ తర్వాత రాజకీయ కారణాలతో స్వంత గూటికే చేరారు.  

2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి తరపున ఎంపీగా పోటి చేశారు. కానీ తక్కువ తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఇటివల జరిగిన పరిణామాలు ఆయనను బాధపెట్టినట్టు తెలుస్తోంది. నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర మంత్రులుగా పదవులు పొందారు. నారాయణ స్వంత వ్యాపారం పై దృష్టి పెట్టి కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయంలో ఆదాల ప్రభాకర్ ఉన్నారు.  

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసిపి ఎమ్మెల్యేలకు సహకరిస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఆదాల, సోమిరెడ్డి రాజకీయ ప్రత్యర్దులు. ఒకే పార్టీలో ఉన్నా వారి మధ్య విబేధాలు సద్దుమణగడం లేదు. ఇటివల ఆదాల వర్గానికి చెందని కొంత మంది నేతలు వైసిపిలోకి జంప్ అవుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న సోమిరెడ్డి ఆదాలకు పార్టీలో అధిక ప్రాధాన్యమిస్తే నష్టం జరుగుతుందని చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం.

నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తన అనుకూలురకే టికెట్లు కేటాయించాలని ఆయన ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. అయితే జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తున్నా కొంతమంది నేతలు వంకలు పెడుతూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తన అనుచరుల వద్ద వాపోయారట. జిల్లా రాజకీయ పరిస్థితుల పై సీఎం చంద్రబాబును కలిసి చెప్పినా కూడా సరైన స్పందన లేదని ఆదాల నిరాశలో ఉన్నారు. దీంతో రాజకీయాలకు స్వస్తి చెప్పి సేవా కార్యక్రమాలు చేసుకుంటా ఉంటానని కూడా ఆదాల ప్రభాకర్ అన్నారట. ఈ నేపథ్యంలో ఆదాల గట్టిగా నిలబడి ఎమ్మెల్యేగా పోటి చేస్తారా లేక ఎంపీ గా పోటి చేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఆయన నిజంగానే రాజకీయాలకు గుడ్ బై చెబుతారా అనేది హాట్ టాపిక్ గా మారింది.