జగన్ కి గుడ్ న్యూస్… “పసుపు ఏడుపు”లో ఇది పీక్స్!

లీటర్‌ మంచినీళ్ల ధర, లీటర్‌ పాల ధర ఒకేలా ఉన్న విషయాన్ని తన పాదయాత్రలో గమనించానని చెప్పిన ఏపీ ముఖ్య మంత్రి జగన్… తాను అధికారంలోకి వస్తే పాడి రైతులకు లీటర్‌ కు రూ.4బోనస్‌ ఇస్తానన్న హామీ ఇచ్చారు. ఇదే సమయంలో చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే అముల్ తో కలిసి ఆ హామీలు నెరవేర్చుకుంటున్నారు!

ఈ నేపథ్యంలో చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు జగన్ మంగళవారం భూమి పూజ చేయబోతున్నారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీ కూడా నెరవేర్చుకుంటున్నారు. ఫలితంగా… దాదాపు 20 ఏళ్ళ క్రితమే మూతపడిపోయిన చిత్తూరు డెయిరీకి పూర్వవైభవం తీసుకురానున్నారు! ఇందుకోసం అమూల్‌ తో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం… పాడి రైతులకు మేలు చేసే దిశగా మరో అడుగు ముందుకేసింది.

అయితే ఈ సమయంలో 20ఏళ్లుగా మూతపడిన డెయిరీ పునరుద్దరణకు నోచుకుంటుందన్న ఆలోచన లేని ఒకవర్గం మీడియా జగన్ సర్కార్ పై ఏడుపు మొదలెట్టింది.. “చిత్తూరు డెయిరీ గోవిందా” అంటూ లాజిక్కుల్లేని విమర్శలు తెరపైకి తెచ్చింది. ఫలితంగా… చంద్రబాబు బండారం మరోసారి తెరపైకి తెస్తూ జగన్ కు పరోక్షంగా గుడ్ న్యూస్ చెప్పింది!

కారణం… 20ఏళ్ల క్రిందట ఈ డెయిరీ నాశనం అయిపోయిందని.. అప్పటినుంచీ పునరుద్దరణకు నోచుకోలేదని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత జిల్లాలో డెయిరీని పునరుద్దరించలేని అసమర్ధుడిగా మిగిలిపోయారనే విషయాలు ఈ జనరేషన్ కు తెలియక పోవచ్చు! అయితే టీడీపీ అనుకూల మీడియా ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి పరోక్షంగా బాబును ఇరకాటంలో పాడేస్తూ.. జగన్ కి పరోక్షంగా గుడ్ న్యూస్ చెప్పినట్లయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇంతకూ ఆ కథనంలోని ఏడుపు ఏమిటంటే… పునరుద్ధరణ చేస్తామని హామీలిచ్చి డెయిరీని అమూల్‌ కు అప్పగించేస్తున్నారని అట. నిజం మాట్లాడుకునే అలావాటుండి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే… ఇప్పుడు ఆ వర్గం మీడియా పెట్టిన హెడ్డింగ్ “చిత్తూరు డెయిరీ గోవిందా” అనేది 20 ఏళ్లక్రితం చంద్రబాబు హయాంలో మూతపడినప్పుడే పెట్టి ఉండాలి. దీంతో… అప్పట్లో అన్నీ మూసుకుని ఇప్పుడు పునరుద్దరణకు నోచుకుంటున్న సమయంలో ఈ ఏడుపు ఎందుకు అని పలువురు కామెంట్ చేస్తున్నారు.

హెరిటేజ్ కోసం చిత్తూరుకు వెన్నుపోటు:

ఒకప్పుడు దేశంలోనే చిత్తూరు డెయిరీ రెండో అతిపెద్ద డెయిరీగా ఉండేది. 1995కి ముందు రోజుకు సుమారు 3 లక్షల లీటర్ల చిల్లింగ్ కెపాసిటి తో పాలు, పాల ఉత్పత్తులతో బ్రహ్మాండంగా వ్యాపారం చేసేది. ఇందులో భాగంగా ఆ ఉత్పత్తులుల్ చిత్తూరు నుండి బంగ్లాదేశ్ వరకు సరఫరా అయ్యేవి. ఫలితంగా వందల మంది రైతులు, వేలాది మంది కార్మికులతో ఈ డెయిరీ కళకళలాడుతూ ఉండేది.

అయితే ఆ కళలళలాడుతున్న డెయిరీపై చంద్రబాబు కన్నుపడిందని.. ఫలితంగా ఆ డెయిరీ మూతకు చంద్రబాబే కారణమనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కారణం… చంద్రబాబు సొంతంగా హెరిటేజ్ డెయిరీని ఏర్పాటుచేసుకున్న అనంతరం ఈ చిత్తూరు డెయిరీని దెబ్బకొట్టారట.

జగన్ రాకతో పూర్వవైభవం!:

మూతపడే నాటికి వందల కోట్ల బకాయిలున్న ఈ చిత్తురు డెయిరీ అప్పులు తీర్చమని ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు పట్టించుకోలేదట. అయితే అది కేవలం హెరిటేజ్ బాగుకోసమే అని విపరీతంగా విమర్శలు వచ్చాయి. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక సుమారు రూ.182 కోట్ల బకాయిలను తీర్చారు. పునరుద్ధరణ పనులను అమూల్‌ కు అప్పగించారు. దీంతో ఆ సంస్థ సుమారు రూ. 400 కోట్ల పెట్టుబడులు పెడుతోంది.

పునరుద్దరణ పనుల అనంతరం అమూల్… ముందుగా దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ ప్లాంట్‌ ను సుమారు రూ.150 కోట్లతో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యిందని తెలుస్తుంది. ఫలితంగా… ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా మరో 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే సుమారు పాతిక లక్షల మంది పాడి రైతులతో అమూల్ ఒప్పందాలు చేసుకుంది.

“అంతా మన మంచికే”:

ఈ స్థాయిలో ఇచ్చిన మాటకు కట్టుబడి… చంద్రబాబు గాలికి వదిలేసిన డెయిరీ పునరుద్ధరణకు జగన్ ఈస్థాయిలో కష్టపడి పునరుద్దరణ, అనంతర చర్యలపై దృష్టిపెడితే… నిస్సిగ్గుగా “చిత్తూరు డెయిరీ గోవిందా” అని ఎల్లో మీడియా ఏడుపు వార్తలు రాయటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో… “అంతా మన మంచికే” అంటూ ఆన్ లైన్ లో కామెంట్లు పెడుతున్నారు జగన్ అభిమానులు!