చంద్రబాబుకు తుగ్లక్ కు సంబంధం ఏమిటి..? 

అమరావతి రాజధాని విషయంలో 2014 నుంచి 2019 మధ్య ఏమి జరిగినా.. గ్రాఫిక్స్ చూపించారని విమర్శించినా.. 2019 – 2024 మధ్య చంద్రబాబు అధికారంలోకి రాకపోవడం వల్లే రాజధాని నిర్మాణం ఆగిందనే చర్చ ఏపీ ప్రజానికంలో ఉంది! కట్ చేస్తే.. 2024 లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చారు.. ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యింది.. మరో రెండు నెలలు పూర్తైతే వర్షాకాలం వస్తుంది.. అమరావతిలో పనులు కొంతకాలం ఆగిపోయే అవకాశాలు పుష్కలం అని గతం చెబుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో… జగన్ మావిగన్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రబాబు నిర్ణయించిన అమరావతి ప్రాంతం కూడా రాజధానిలోనే ఉంటుంది అని చెబుతూనే… అటూ ఇటూ ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను సైతం కలుపుకుని రాజధానిపై ఓ స్పష్టతకు రావడం వల్ల… లక్షల కోట్లు కొన్ని వేల ఎకరాల్లో మాత్రమే పోయకుండా.. తక్కువ సొమ్ముతోనే రాజధానిని సకల సౌకర్యాలతో, ప్రపంచంతోని అన్ని రకాల కనెక్టివిటీతోనీ అభివృద్ధి చేసుకోవచ్చని అంటున్నారు.

ఈ క్రమంలో ఒకప్పటి ఢిల్లీ పాలకుడు తుగ్లక్.. రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాలను, నేడు ఏపీ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో పోలుస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర చర్చ మొదలైంది.

ఢిల్లీ చక్రవర్తులలో ఒకరైన మహమ్మద్ బిన్ తుగ్లక్, భారత చరిత్రలో ‘తెలివైన మూర్ఖుడు’గా ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. మహమ్మద్ బిన్ తుగ్లక్ స్థాపించిన తుగ్లక్ రాజవంశం, కేవలం అతని మూర్ఖత్వం కారణంగా చాలా తక్కువ కాలం మాత్రమే కొనసాగిన పరిస్థితి.

ఈ నేపథ్యంలో… భారతదేశ చరిత్రలో అతన్ని ఎందుకు ఒక తెలివైన మూర్ఖుడిగా పరిగణిస్తారు.. అందులో ప్రధానంగా రాజధాని విషయంలో తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి.. ఎందుకు అనేది ఇప్పుడు చూద్దామ్….!

మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక ధైర్యవంతుడైన రాజు అయినప్పటికీ, భారత చరిత్రలో అతన్ని తెలివైన మూర్ఖుడిగా పరిగణించారు. అందుకు గల కారణాలు చాలానే ఉన్నప్పటికీ… అందులో ప్రధానమైనది రాజధాని విషయంలో ఆయన తీసుకున్న చారిత్రక తప్పిదమే.

అవును… తన రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు తుగ్లక్. మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒక పురాతన ప్రదేశం అయిన దేవగిరికి తుగ్లక్ దౌలతాబాద్ అని పేరు పెట్టాడు. మొత్తం భారత భూభాగాన్ని పాలించాలనే ఉద్దేశంతో.. పైగా ఈ ప్రాంతం భౌగోళికంగా దేశానికి దాదాపు మధ్యలో ఉంటుందనే ఆలోచనతో అతను తన రాజధానిని మార్చాలనే తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు.

రాజధాని అంటే దేశానికి సరిగ్గా మధ్యలోనే ఉండాలా..? తుగ్లక్ అలానే ఆలోచించాడు. దీంతో.. అతను తన సైనికులు, యోధులందరినీ ఢిల్లీ – దౌలతాబాద్ మధ్య ఉన్న ఈ సుదీర్ఘ దూరాన్ని ప్రయాణించమని ఆదేశించాడు. ప్రజలు ప్రయాణం ప్రారంభించగానే, వారిలో చాలామంది మార్గమధ్యంలోనే మరణించారు. చాలామంది యోధులు బలహీనపడిపోయారు, మరికొందరు ఇక ముందుకు ప్రయాణించే స్థితిలో కూడా లేరు. ఈ నిర్ణయం కారణంగానే ఆయనను తెలివైన మూర్ఖుడు అని చరిత్ర గుర్తుపెట్టుకుంది!

వాస్తవానికి తుగ్లక్ తన రాజధానిని మార్చడం వెనుక మంగోలుల నుండి పొంచి ఉన్న ప్రమాదం కారణంగా చెబుతారు. అయితే… తుగ్లక్ సరైన ప్రణాళిక, హేతుబద్ధత లేకుండా ఆ పనిని చేశాడు. అంతేకాకుండా.. అధ్వాన్నమైన పరిస్థితుల వల్ల ప్రజలు కొత్త రాజధానికి తరలివెళ్లి, తిరిగి రావడం చాలా కష్టతరమైన పనిగా మారింది.

ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని విషయంలో సోషల్ మీడియా వేదికగా తాజాగా మరో విశ్లేషణ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… ప్రాక్టికల్ గా ఆలోచించకుండా ఒక మహానగరాన్ని నిర్మించి, తన పేరు చిరస్థాయిగా నిలవాలని తుగ్లక్ కలలు కన్నారని… ఈ క్రమంలో తన రాజ్యంలోని ప్రజల కష్టాలు, బాధలను పట్టించుకోకుండా మూర్ఖపు నిర్ణయం తీసుకున్నారని.. ఫలితంగా భారీ ఆర్థిక వినాశనానికి తన నిర్ణయం దారి తీసిందని చెబుతున్నారు.

తాజా పరిస్థితులు చూస్తుంటే… రాజకీయంగా ఎంతో అనుభవం ఉండి, ముఖ్యమంత్రిగా చాలా సీనియర్ అయ్యి ఉండి, ఆయన అడ్మినిస్ట్రేషన్స్ స్కిల్స్ కి ఫ్యాన్స్ ఉండి, ఆయనను పలువురు విజనరీ అని కొనియాడుతున్న నేపథ్యంలో… అమరావతి విషయంలోనూ “తుగ్లక్ – దౌలాతాబాద్” తరహాలో జరిగేలా ఉందని ఏపీ ప్రజానికంతో పాటు పలువురు మేధావుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే… 2029 ఎన్నికలకు వెళ్లే లోపు అమరావతికి ఓ రూపం తీసుకురానిపక్షంలో… చంద్రబాబు ఓ తెలివైన మూర్ఖుడిగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదని ఆయన అభిమానులు, తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.