చంద్రబాబు కోసం ఏసీ.! ముందే ఈ పని చేసేసి వుండొచ్చుగా.!

న్యాయస్థానం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఏసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి గత కొంతకాలంగా చర్మ సంబంధిత సమస్య వుంది. రాజమండ్రిలో వేడి వాతావరణం నేపథ్యంలో, చంద్రబాబుకి చర్మ సంబంధిత సమస్య తీవ్రమైంది.

ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా.? జైలు అధికారులు, ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించలేదా.? చాలా సిల్లీ క్వశ్చన్స్ ఇవి. చంద్రబాబు అనారోగ్య సమస్య మీద వైసీపీనే చాలాసార్లు సెటైర్లేసింది. ప్రాణాంతక సమస్య కాదుగానీ, చాలా పెద్ద సమస్య అది.!

లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తావన తీసుకొచ్చి, జైల్లో చాలామంది ఖైదీల అనారోగ్య సమస్యలు ప్రస్తావించి.. ‘చంద్రబాబుకెందుకు ప్రత్యేక శ్రద్ధ.?’ అంటూ అటు జైలు అధికారులు, ఇటు ప్రభుత్వ పెద్దలు కామెంట్స్ చేయడం చూశాం.

కానీ, న్యాయస్థానం.. చంద్రబాబుకి ఏసీ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రి గనుక, చంద్రబాబుకి అనారోగ్య సమస్య వుంది గనుక.. రాజమండ్రి జైలులో ఆయన కోసం ప్రభుత్వమే ప్రత్యేక ఏర్పాట్లను చేసి వుండాల్సింది. అలా చేసి వుంటే, ఇంత వరకూ వచ్చి వుండేది కాదు.

ఇప్పుడీ అనారోగ్య సమస్య కాస్తా, చంద్రబాబు మీద సింపతీ పెరగడానికి కారణమవుతోంది. వైసీపీ వేధింపులు.. అన్న మాట జనంలోకి బలంగా వెళ్ళిపోతోంది. పైగా, చంద్రబాబు వయసు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘పెద్దాయనను జగన్ వేధిస్తున్నాడు..’ అన్న మాట పల్లెల్లోనూ వినిపిస్తోంది.

అప్పటిదాకా చంద్రబాబుని విమర్శించినోళ్ళు కూడా, ‘పాపం చంద్రబాబు’ అనేలా చేసింది మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొండితనమే.! అవసరమా ఈ సెల్ఫ్ గోల్.?