పాము కాటు వేస్తే ఇలా మాత్రం చెయ్యొద్దు ప్లీజ్!

దేశంలో మూఢనమ్మకాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దైవభక్తికి, ప్రకృతిపై గౌరవానికీ, ముఢనమ్మకాలకూ తేడా లేకుండా పోతున్నట్లు కనిపిస్తున్న ఈ రోజుల్లో.. మనిషిలోని ఆలోచనలు రోజు రోజుకీ కాకరకాయ, కీకరాకాయ మాదిరిగా మారిపోతున్నాయని అంటున్నారు పరిశీలకులు. పైగా ఇలాంటి పైత్యాలకు పలువురు రాజకీయ నాయకుల నుంచి దైవభక్తి పేరుతో పరోక్ష మద్దతు కూడా తోడవుతుండటం మరీ దారుణమైన విషయమని మరికొంతమంది వాపోతున్నారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన దేశంలో మూఢనమ్మకాలు ఇంకా ఏ స్థాయిలో పాతుకుపోయాయో చెప్పకనే చెబుతుంది.

భూమి నుండి లక్షల కిలోమీటర్ల దూరంలోని అంతరిక్షంలోకి మనిషి ప్రయాణిస్తున్న ఈ రోజుల్లో.. ఆ నీటిలో మహిమలున్నాయి, ఈ మట్టిలో మంత్రాలున్నాయి, ఆ చెట్టులో శక్తులున్నాయి, ఆ ఆకులో దైవాలున్నాయి, ఆ నూనెలో స్వస్థత వరాలున్నాయి వంటి మాటలు, నమ్మకాలు.. విన్న పలువురికి నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి. అందుకే అంటారు.. దేవుడిని నమ్మితే నమ్మండి కానీ.. నేనే దేవుడిని అన్నట్లుగా ప్రవర్తించే వాళ్లను, తాము దేవుడికి, భక్తులకు అనుసంధానకర్తలమని చెప్పుకునేవారిని మాత్రం పక్కనపెట్టండి అని!

వివరాళ్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ లోని అడంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పితంపూర్ గ్రామానికి చెందిన జైరామ్ సింగ్ అనే వ్యక్తికి 14 ఏళ్ల సుర్జీత్ అనే కుమారుడు ఉన్నాడు. అతడు ఇటీవల పొలం వద్ద బస్తాలో నుంచి గడ్డి తీస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. ఆ సమయంలో నొప్పి భరించలేక గట్టిగా కేకలు వేశాడు సుర్జీత్. దీంతో.. అతడి కేకలు విని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఓ తాంత్రికుడి వద్దకు తరలించారు.

అది వారి అజ్ఞానమో.. లేక, ఆ తాంత్రికుడి మాటల, కోతల ప్రభావమో తెలియదు కానీ.. వైద్య చికిత్స కంటే తాంత్రికుడి మంత్రాలవైపే సదరు బాధిత బాలుడు సుర్జీత్ తల్లితండ్రులు మొగ్గు చూపారు. ఈ సమయంలో.. తన వద్దకు తీసుకు వచ్చిన బాలుడి ప్రాణాలు నిలవాలంటే అతడిని గంగానది ప్రవాహంలో 12 గంటల పాటు ఉంచాలని సూచించాడట సదరు తాంత్రికుడు.

ఇంకేముంది.. సదరు తాంత్రికుడిని పూర్తిగా నమ్మిన ఆ తల్లితండ్రులు.. తమ కుమారుడి తల పైకి ఉండి, మిగతా శరీర భాగం అంతా గంగానదిలో మునిగేలా ఓ కర్రకు కట్టి తాళ్లతో వేళాడదీశారు. కట్ చేస్తే… ఆ బాలుడు విగతజీవిగా మారాడు. ఆ తర్వాత ఎవరైనా చెప్పారో.. లేక, గట్టిగా గడ్డిపెట్టారో తెలియదు కానీ.. అంతా ఐపోయాక ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆ బాలుడు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఫలితంగా తల్లితండ్రులకు కడుపు కోత, ఆ తాంత్రికుడికి దక్కితే నాలుగు రూపాయలు, స్థానికంగా ఫ్రీ పబ్లిసిటీ దక్కింది.

ఈ సందర్భంగా అంతా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే… పాము కాటుకు గురైన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తే… వైద్యులు చికిత్స అందిస్తారు. పాము కాటు వేసిన వెంటనే బాధితుడిని కదలకుండా ఉంచి, గాయాన్ని శుభ్రం చేసి, వెంటనే అత్యవసర వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తే.. వైద్యులు అతడికి యాంటీవెనం అనే ఇంజెక్షన్ ఇస్తారు! అది సక్రమంగా పనిచేస్తుందని చెబుతారు!

అంతే తప్ప పాము కాటుకు పలానా వ్యక్తి మంత్రం వేస్తాడు.. మరో వ్యక్తి తాయత్తు కడతాడు.. ఇంకో వ్యక్తి పసరు పూస్తాడు వంటి ఆలోచనలు ఏమాత్రం చేయొద్దని కోరుకుంటున్నారు నిపుణులు! దయచేసి కొంత మంది తమ తమ అజ్ఞానం, మూర్ఖత్వాల కారణంగా ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని సూచిస్తున్నారు.