దేశంలో బిజెపికి ఒక ప్రత్యేకత వుంది. క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకుంటారు. కాని మోదీ షా ద్వయం వచ్చిన తర్వాత పలువురు కరుడు గట్టిన హిందుత్వవాదులు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనారు. ఒక్కో సమయంలో వీరు అదుపు తప్పి మాట్లాడటం వలన తలనొప్ఫులు తెచ్చిన సందర్భాలు లేక పోలేదు. మొన్న ఢిల్లీ ఎన్నికల్లో ఇలాంటి వారి ప్రసంగాలతో ఓటమి చవి చూచామని అధిష్టాన వర్గం భావించడం మనమెరుగుదుం. ఇదే పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ కూడా చాలా రోజులుగా వ్యక్తమౌతోంది. ఇటీవల బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జివియల్ నరసింహారావు రాష్ట్ర నాయకులు ఒకటి మాట్లాడితే ఆయన మరో రకంగా మాట్లాడటం రివాజు అయింది. క్రమ శిక్షణ గాలికి పోయింది.రాజధాని అమరావతి అని దాన్ని కదలనీయమని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటన చేస్తుంటే నరసింహారావు మాత్రం రాజధాని రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని చెప్పిన సందర్భాలున్నాయి. అంతా కప్పల తక్కెడ వ్యవహారమైంది.
ఇప్పుడు -. విశాఖ ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు నాయుడును అడ్డుకోవడంపై బిజెపిలో భిన్న స్వరాలు వెలువడ్డాయి. సాక్షాత్తు విశాఖ పట్నంకు చెందిన ఎమ్మెల్సీ మాధవ్ మాజీ శాసన సభ్యులు విష్ణుకుమార్ రాజు చంద్రబాబు నాయుడు పర్యటన అడ్డుకోవడం తప్పుపడితే బిజెపి జాతీయ అధికార ప్రతినిధి నరసింహారావు మాత్రం చంద్రబాబు నాయుడును నిందించుతూ మాట్లాడారు. గతంలో బిజెపి అగ్రనేతలను అవమాన పర్చారని జగన్మోహన్ రెడ్డిని అడ్డగించారని పాత వన్నీ ప్రస్తావిస్తూ ప్రకటన చేశారు. గాని రాష్ట్ర నాయకులు లాగా విశాఖ ఘటనలను తప్పు పట్ట లేదు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అసలు నోరు విప్ప లేదు. అధ్యక్ష పదవి వుంటుందా పోతుందా అనే మీమాంస లో వున్నారు. గత కొంత కాలంగా రాష్ట్ర బిజెపి నేతల్లో కొందరికి జివియల్ నరసింహారావు వైఖరుల మధ్య అగాధం కన్పించుతోంది. . ఇటీవల టిడిపి నేతలు జివియల్ నరసింహారావుపై ఘాటైన వ్యాఖ్యలు చేసినా ఒక్క రాష్ట్ర బిజెపి నేత నర్సింహారావుకు అనుకూలంగా కౌంటర్ ఇవ్వలేదు. గమనార్హమైన అంశమేమంటే విశాఖ పట్నంకు చెందిన ఎమ్మెల్సీ మాధవ్ కూడా అమరావతి రాజధానిగా వుండాలని వాదిస్తుంటే నరసింహారావు మాత్రం కొన్ని మినహాయింపులతో మాట్లాడుతున్నందున పలు అంశాల్లో బిజెపి నేతల్లో ఏకీభావం లేదనిపిస్తోంది.
