వాటర్ వార్.. నలిగిపోతున్న భాజాపా, కాంగ్రెస్

 
ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న వాటర్ వార్ ప్రధానమైన వైకాపా, తెరాస పార్టీలకంటే భాజాపా, కాంగ్రెస్ పార్టీలను ఇరుకున పడేసింది.  అందుకు కారణం రెండు రాష్ట్రాల్లోనూ భాజాపా, కాంగ్రెస్ పార్టీలు ఉండటమే.  ఏపీకి నీళ్లు తీసుకెళ్ళి తీరుతామని వైకాపా అంటుంటే ప్రసక్తే లేదు న్యాయపోరాటమైనా చేసి ప్రాజెక్ట్ ఆపాల్సిందేనని తెరాస పటుబట్టుకుని కూర్చుంది.  దీంతో ఇరు రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్, భాజాపాలు ఏ రాష్ట్రానికి సపోర్ట్ చేయాలి, ఎవరిని వ్యతిరేకించాలో తేల్చుకోలేక సతమతమవుతున్నాయి. 
 
తెలంగాణలో కొంచెం బలంగా ఉన్న భాజాపా కేసీఆర్ జగన్ ముందు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టేలా ఉన్నారని అంటోంది.  కరీంనగర్ ఎంపీ, తెలంగాణ భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం జీవోను పాస్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.  దీంతో ఏపీ భాజాపా శ్రేణులు ఇప్పుడు తమ పార్టీ వ్యక్తి బండి సంజయ్ మాటలను బలపర్చాలా లేకపోతే ఏపీలో ఉన్నాం కాబట్టి జగన్ నిర్ణయాన్ని సమర్థించాలా అనే మీమాంసలో చిక్కుకున్నాయి.  ఇప్పటికే ఏపీ భాజాపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నీళ్లు తీసుకునే అవకాశం ఏపీకి ఉందంటూనే ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలీదు కానీ రాయలసీమకు అన్యాయం జరక్కూడదు అంటూ జగన్ మీద ఒత్తిడి తెచ్చేలా మాట్లాడారే కానీ బండి సంజయ్ వ్యాఖ్యలను మాత్రం ఖండించలేదు. 
 
ఇక టీ కాంగ్రెస్ విషయానికొస్తే వైఎస్ హయాంలోనే పోతిరెడ్డిపాడు నిర్మాణం జరిగింది కాబట్టి దాన్ని తప్పుబట్టి, సొంత నేతలను విమర్శలకు గురిచేసి  కేసీఆర్ మీద సవాల్ విసిరలేక అసలు ఈ అంశాన్ని పక్కనబెట్టి కరోనా అంశాల ద్వారానే తెరాస సర్కార్ మీద ఒత్తిడి తెస్తే పోతుంది కదా అనే ఆలోచనలో ఉన్నారు.  ఇక ఏపీలోని కాంగ్రెస్ శ్రేణులైతే మనం మట్లాడినా ఎవరు పట్టించుకుంటారు.. టీ కాంగ్రెస్ నేతలే సైలెంట్ అయినప్పుడు మనం కూడా అదే ధోరణిలో ఉంటే సరిపోతుందిలే అన్నట్టు నోరు మెదపడంలేదు.