రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన వాల్ స్ట్రీట్ జర్నల్

సాధారణంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని లేక రాష్ట్రాల్లో ప్రముఖంగా వుండే మంత్రులు గాని దేశ విదేశాల్లో జరిగే సదస్సుల్లో పాల్గొని ప్రఖ్యాతి పొందుతారు. జాతీయ అంతర్జాతీయ మీడియాలో ప్రముఖ నేతలుగా పేరు పొందుతారు. ఈ లిస్టులో చంద్రబాబు నాయుడు తెలంగాణకు చెందిన మంత్రి కెటిఆర్ వున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో అఖండ విజయం సంపాదించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంత వరకు ఈలాంటి సదస్సుల్లో దేశీయంగా గాని అంతర్జాతీయంగా గాని పాల్గొని మీడియా దృష్టి ఆకర్శించిన సందర్భంలేదు.

అంత వరకు అయితే ఫర్వాలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తొలి నుండి లోకల్ మీడియా అటుంచగా జాతీయ మీడియాతో కూడా ఉప్పు నిప్పుగా వుంది? తెలుగు మీడియా విమర్శనాత్మక కథనాలు రాస్తే అందుకు సామాజిక వర్గం లేదా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో జరుగుతున్నదని భావించేందుకు ప్రాతిపదిక వుంది. కాని తదుపరి జాతీయ మీడియాలో పేరు ప్రఖ్యాతులు గల శేఖర్ గుప్తా లాంటి వారు ఆ వెంటనే జాతీయ మీడియాకు చెందిన పలు ఇంగ్లీషు పత్రికలు వరస బెట్టి సంపాదకీయాలను రాస్తూ ముఖ్యమంత్రి విధానాలను దుయ్య బట్టా యి.

ఈ సందర్భంలో కూడా వైసిపి నేతలు ఆత్మ వంచన చేసుకుంటూ ఇదంతా చంద్రబాబు నాయుడు ప్రేరేపితమని ఆరోపించి సర్దుకున్నారే గాని జాతీయ మీడియా తప్పులు రాసిందని వాటి దృష్టికి సవరణలు తీసుకెళ్లిందీ లేదు. లేదా తను అనుసరిస్తున్న విధానాలను సమర్థించుకున్న ఒక్క సందర్భం లేదు. లేదా తను అనుసరిస్తున్న విధానాల్లో తుదకు జాతీయ మీడియా సూచించినట్లుతప్పులు వుంటే సింహావలోకనం చేసుకొని సరి దిద్దుకున్నదీ లేదు.

ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ వార్త సంస్థ రాయిటర్స్ వైసిపి ప్రభుత్వంపై పెద్ద బాంబు పేల్చింది. అనంతపురం జిల్లాలో నెలకొల్పబడి ఉత్పత్తి కూడా మొదలు పెట్టిన కియా కార్లు ఉత్పత్తి చేసే సంస్థ రాష్ట్ర ప్రభుత్వవైఖరి మింగుడు పడకుండా తమిళ నాడుకు తరలి పోతుందని ఒక కథనం ప్రకటించింది. ఈ వార్త పెద్ద కల్లోలమే సృష్టించినది.

ఎటూ మింగుడు పడని కొందరు వైసిపి నేతలు ఈ వార్త కథనాన్ని కూడా చంద్రబాబు నాయుడుకు లేని పలుకు బడి అంట గట్టి చేతులు దులుపు కున్నారు. కియా మోటార్స్ గొడవ సర్దుమణిగిందో లేదో “వాల్ స్ట్రీట్ జర్నల్” పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాల ఉల్లంఘన గురించి ఒక ఆర్టికల్ ప్రచురించుతూ ముఖ్యమంత్రి విధాలను తూర్పాన బట్టింది.

భారత దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్ర ప్రదేశ్ పునరుద్పాదక విద్యుదుత్పత్తి చేసే సంస్థలకు బకాయి పడివుందని తేల్చింది.ఈ విధానం కంపెనీల్లో భయాందోళనలు కలిగించుతున్నదని వివరించింది. జాతీయ మీడియా రాయిటర్స్ లాంటి సంస్థలను ఎల్లో మీడియా చెప్పుగలిగారే గాని వాల్ స్ట్రీట్ జర్నల్ కు చంద్రబాబు నాయుడుకు లింకు పెట్టి సర్దుకుంటే ఆత్మ వంచనే అవుతుంది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న దశలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక దఫా తన విధానాలను పునరాలోచన చేయడం అత్యవసరం