రాజధాని నిర్మాణం ఆగిపోతుందా ?

రాజధాని అమరావతి నిర్మాణం ఆగిపోతుందా ? ఇపుడిదే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన ఓ ప్రకటన సంచలనంగా మారింది. రాజధాని నిర్మాణాలకు అమరావతి ప్రాంతం సురక్షితం కాదంటూ బొత్స చేసిన ప్రకటనతో అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.

రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర విభజన సమయంలోనే అప్పటి కేంద్రప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటిని వేసిన విషయం తెలిసిందే. ఆ కమిటి కూడా ఇప్పటి అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దే వద్దని నొక్కి చెప్పింది. ఈ ప్రాంతం భూకంపాలకు దగ్గరగా ఉన్న ప్రమాధకరమైన ప్రాంతమని చెప్పింది. పైగా లోతట్టు ప్రాంతం కూడా కావటంతో వర్షాలు, వరదలు వచ్చినపుడు ముణిగిపోతుందని కూడా చెప్పింది.

అయినా సరే చంద్రబాబునాయుడు ఏరికోరి అమరావతి ప్రాంతాన్నే ఎంపిక చేశారు. కృష్ణా-గుంటూరు ప్రాంతాల్లోని కమ్మోరి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే ఈ ప్రాంతాన్ని ఏ విధంగా ఎంపిక చేసినా వర్షాలు వచ్చినపుడు చాలా ఇబ్బందిగా ఉంటున్న మాట మాత్రం వాస్తవమే.

తాజాగా బొత్స అదే విషయాన్ని ప్రకటించారు. వర్షాలు, వరదలు వచ్చినపుడు చాలా ఇబ్బందిగా ఉంటోందన్నారు. నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగిపోతోందన్నారు. అన్నీ విషయాలు ప్రభుత్వం చర్చిస్తోందని బొత్స చేసిన ప్రకటనతో అందరిలోను రాజధాని మార్పా అనుమానాలు మొదలయ్యాయి. చూడాలి జగన్మోహన్ రెడ్డి అమెరికా నుండి వచ్చి తర్వాత ఏ విధంగా స్పందిస్తారో ?