బొండా ఉమ, బుద్దా వెంకన్న వాహనాలపై దాడి… పారిపోయిన గన్‌మెన్..

గుంటూరు జిల్లా మాచర్లలో తెలుగుదేశం నాయకులు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలపై ఇనుపరాడ్లు, కర్రలతో దాడి జరిగింది. మాచర్లలో పర్యటిస్తున్న సమయంలో ద్విచక్రవాహనాలపై వెంబడించి కర్రలు, ఇనుపరాడ్లతో వారిపై దాడి చేశారు. డ్రైవర్‌ అప్రమత్తతో వ్యవహరించి కారును వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో బుద్దా వెంకన్న దాడి నుంచి తప్పించుకోగలిగారు. అయితే న్యాయవాది కిశోర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దాడిపై న్యాయవాది కిశోర్ మాట్లాడుత ‘టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ అనుమతించకపోవడంతో న్యాయపరమైన సమస్య పరిష్కారానికి వెళ్లాను. ఒక్కసారిగా వచ్చి మా కారుపై దాడి చేశారు. తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మాపై దాడి చేయడంతో డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై కారును వేగంగా పక్కకు మళ్లించడంతో ప్రాణాలతో బయటపడ్డాం’’ అని తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ.. ‘నిన్న నామినేషన్‌ ప్రక్రియను అడ్డుకోవండతో.. అభ్యర్థులతో మాట్లాడేందుకు వెళ్లాం. బుద్దా వెంకన్న కూడా వచ్చారు. ఆయన వెళ్తున్న కారుపై ఒక్కసారిగా ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేశారు. కారు అద్దాలు పగులగొట్టారు న్యాయవాది కిశోర్‌ తలపై కర్రలతో దాడి చేశారు. వాళ్లనుండి తప్పించుకుని మర్కాపురం వైపు వెళ్తుంటే మళ్లీ అడ్డుకుని దాడికి యత్నించారు. గన్ మెన్‌ తుపాకీ చూపిస్తే అతనిపై కూడా దాడి చేశారు. దీంతో గన్ మెన్ కూడా పరారయ్యాడు. పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చినా సురక్షితంగా తీసుకెళ్తారనే నమ్మకం లేదు. మాకు రక్షణగా వచ్చిన డీఎస్పీ వాహనంపైనా దాడి చేశారు’ అని బోండా ఉమా తెలిపారు.

‘ప్రాణాలతో తిరిగొస్తామనే నమ్మకం లేదు. మేం ఎటు వైపు వెళ్తున్నామో వెంటనే వారికి సమాచారం వెళ్తోంది. అడుగడుగునా అడ్డుకుని దాడికి యత్నిస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసు వాహనంలోనే ఉన్నాం. ఈ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు’ అని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.