నటుడు, మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూత

నట దర్శకుడు శివప్రసాద్ మృతి

ప్రముఖ సినీ నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్‌ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. శివప్రసాద్‌ 1951 జులై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో జన్మించారు. శివప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.

శివప్రసాద్‌ ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. సయ్యాట, దూసుకెళ్తా, తులసి, మస్కా, ద్రోణ, కుబేరులు, ఆటాడిస్తా, ఒక్కమగాడు, డేంజర్‌, కితకితలు, ఖైదీ, జైచిరంజీవ, పిల్ల జమీందార్‌, బలాదూర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం సినిమాలతోపాటు మరెన్నో చిత్రాల్లో నటించారు. శివప్రసాద్ నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు-ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కరొకో.

అలాగే శివప్రసాద్‌ 1999-2004 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999-2001 మధ్య సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2009, 2014లో చిత్తూరు నుంచి టీడీపీ ఎంపీగా ఎన్నికయ్యారు. శివప్రసాద్‌ రోజుకొక వేషంలో కనిపిస్తూ ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ లో వినూత్న రీతిలో నిరసనలు తెలిపి..పోరాటం చేశారు.