టీడీపీ నేత రాయపాటి‌పై మోదీ ప్రేమ.. రూ.1790 కోట్లు రద్దు!

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేదల ఈఎంఐలు రద్దుకాలేదు.. ఇళ్ల కిరాయి తీసుకోకుండా ఓనర్లు ఆగలేదు.. కానీ.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా పెద్ద మనసు చేసుకుని దేశ వ్యాప్తంగా బడా బాబులకు చెందిన రూ.68వేల 607 కోట్ల రూపాయలు రద్దు చేసింది.

పది వేలకు, యాభై వేలకు పేదల ఇళ్లను వేలం వేసే బ్యాంకులు.. వేల కోట్లు బాకీ పడి.. కట్టలేం అని ఐపీలు పెట్టేసిన వారి పట్ల చాలా ఉదారత చూపించాయి. వాళ్ల నుండి వసూలు చేయలేమని చేతులెత్తేశాయి.. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బాకీలన్నీ మొండి బాకీలుగా పేర్కొంటూ రద్దు చేసేసింది. ఈ బాకీలు రద్దైన వారిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీ ఎగ్గొట్టిన మొత్తం రూ.1790 కోట్లు.

రాయపాటి సాంబశివరావు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ దేశంలోనే అగ్ర కంపెనీల స్థానంలో ఉంది. ఇరిగేషన్, రోడ్ల నిర్మాణం ప్రాజెక్టులు ఎన్నో చేసింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ చేపట్టింది. కాంగ్రెస్ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ప్రాజెక్ట్‌ను అందుకుంది. తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎంపీగా గెలిచిన రాయపాటి పోలవరం ప్రాజెక్ట్‌ పనులను కంటిన్యూ చేశారు. చాలా సార్లు పనులు ఆపేశారు. అయితే ఎన్ని చేసినా ఇప్పుడు మాత్రం ఆయన బాగా హ్యాపీగా ఉండి ఉంటారు. ఏది ఏమైనా.. బ్యాంకులకు డబ్బులు ఎగవేసే వారి పట్ల మోడీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, శ్రద్ధ, బాధ్యత మరోసారి స్పష్టంగా కనిపించింది.