జగన్మోహన్ రెడ్డి ఏదీ చేసినా సాహసోపేతమే!

బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రెండు నిర్ణయాలు వాస్తవంలో సాహసోపేతమైనవే. రాష్ట్రంలో NPR పాత పద్ధతిలో నిర్వహించాలని ఆమేరకు శాసన సభలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. ఒక విధంగా మోదీ షా ద్వయాన్ని ఎదుర్కొనడమే ఇది కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం ఆమోదం కాదు. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో ఈలాంటి నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకుంటారని చాల మంది రాజకీయ విశ్లేషకులు భావించ లేదు. మూడు రాజధానుల ప్రతి పాదన గట్టైక్కాలంటే శాసన మండలి రద్దు వెంటనే జరగాలి.అయినా ముఖ్యమంత్రి సాహసం చేశారు.

ఇదిలా వుండగా స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు బిసిలల్లో తీవ్ర మైన అసంతృప్తి ఆందోళన కలిగించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం నుండి 24 శాతానికి బిసిల రిజర్వేషన్లు తగ్గి పోతే కనీసం 15 వేల వరకు బిసిలకు లభించే పదవులు చేజారి పోతాయి వారిని ఏలా సంత్రుప్తి పర్చుతారో మిలియన్ డాలర్ల ప్రశ్నే.పైగా అధాకారం చేపట్టిన ఈ మధ్య కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో ఎంతో కొంత ప్రభుత్వం వ్యతిరేకత మూట గట్టుకొనడం వాస్తవం.అయినా అవేవీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి బిసిలకు 24 శాతం రిజర్వేషన్ తోనే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంకావడం కూడా ఒక విధమైన సాహసమే..

తను అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా నవ రత్నాలు అమలు చేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలే తనను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుతాయనే నమ్మకమే ముఖ్యమంత్రిని ఈ విధంగా నడిపిస్తోంది. జనాభాలో ఎక్కువగా వున్న బిసిల అసంతృప్తి గెలుపొందుతుందా? లేక ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పైచేయి సంపాదించుతాయా? స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలనున్నది. స్వతహాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయమో వీర స్వర్గమో అని తను భావించినది అమలు జరపడం ఆనవాయితీగా వుంది. రాజ శేఖర్ రెడ్డి చని పోయిన తర్వాత ఓదార్పు యాత్ర సోనియా గాంధీ చెప్పినట్లు కొన్నాళ్లు వాయిదా వేసుకొని వుంటే అప్పట్లోనే ముఖ్యమంత్రి పదవి అలంకరించే వారనేది రాజకీయ వర్గాల భోగట్టా. కాని ఏం జరిగిందీ అందరికి తెలుసు. ఈ రోజు కూడా కీలక మైన రెండు అంశాల్లో ముందు వెనుక చూడకుండా నిర్ణయం తీసుకున్నారు