లోకేష్ వ్యూహకర్తలు ఏమి ఆలోచిస్తున్నారు?

గత పది సంవత్సరాలుగా చంద్రబాబు లేకుంటే లోకేష్ మీడియా ముందుకొచ్చి తమ కుటుంబానికి చెందిన ఆస్తులు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ ఆస్తుల ప్రకటన మీద సోషల్ మీడియాలో కానీ బయట జనాల్లో కానీ సెటైర్లు పడుతున్నాయి. ఆస్తులు ప్రకటించడం, పారదర్శకంగా ఉండటం రాజకీయాల్లో  మేలు చేయాలి కానీ ఇలా నవ్వులపాలు కాకూడదు.

1999వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎన్నికలను ఎదుర్కొంటున్న సమయం. మధ్యతరగతిలో చదువుకున్న వారిలో చంద్రబాబు అంటే ఒక క్రేజ్. ఎందుకంటే ఒక యువ ముఖ్యమంత్రిగా ప్రజల వద్దకు పాలన, పనికి ఆహార పథకం, జన్మ భూమి లాంటి కొన్ని వినూత్న కార్యక్రమాలతో అప్పటి వరకు రాజకీయ నాయకులు అంటే ఉన్న ఇమేజ్కి భిన్నంగా తనని తను ప్రాజెక్ట్ చేసుకోగలిగారు. చంద్రబాబు అప్పట్లో తటస్థులు అని అనేక మంది విద్యావంతులను,రిటైర్డ్ అధికారులను, పారిశ్రామికవేత్తలను తెలుగుదేశం తరుపున రాజకీయ రంగప్రవేశం చేయించి గెలిపించడమే కాకుండా తనను తాను ఒక నవతరం నాయకుడిగా ఆవిష్కరించుకున్న ఎన్నికలివి.

ఇవన్నీ ఒకప్పటి కబుర్లు. కాలం మారింది, జనాలు రాజకీయ నాయకులు చేసే పనుల మీద వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం అర్థం చేసుకునే స్థాయికి వచ్చేశారు. అది సోషల్ మీడియా వల్ల కావచ్చు 24 గంటలు ప్రసారమయ్యే న్యూస్ చానెల్స్ వల్ల కావచ్చు మొత్తానికి జనాలకి రాజకీయాల మీద ఒక అవగాహన రాజకీయ నాయకుల మీద ఒక అభిప్రాయం కలగడం మొదలైంది.

అయినప్పటికీ లోకేష్ ఇంకా పాతకాలంలో పనిచేసిన పద్ధతులనే ఇప్పటికీ అనుసరించడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆస్తుల ప్రకటన వల్ల జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు నా కుటుంబానికి అన్నీ అప్పులే అని ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు సానుభూతితో ఓట్లు వేస్తారా లేదా ఓ వెయ్యి కోట్లని  ప్రకటిస్తే లోకేష్ చంద్రబాబు అవినీతి చేశారని ఓట్లు వేయడం మానేస్తారా? 

చంద్రబాబు లోకేష్ ఇద్దరూ రాజకీయాల్లో ఉండి శాసనసభకు శాసనమండలికి పోటీ చేసేటప్పుడు వారి ఆస్తులు ఎప్పుడో ప్రకటించారు. మరి ఇప్పుడు ప్రకటించే ఆస్తులు వాటికంటే భిన్నంగా ఏముంటాయి?? ఒకవేళ ఎవరైనా వీరి ఆస్తులు గురుంచి తెలుసుకోవాలంటే ఎన్నికల అఫిడవిట్ చూస్తే సరిపోతుంది. అఫిడవిట్లో పోటీ చేసే అభ్యర్థి కాకుండా తన కుటుంబం ఆస్తులను ప్రకటించాలి. అలా చూసుకున్నప్పుడు చంద్రబాబు ఇంట్లో ఉన్న ఐదు మంది కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు లోకేష్, చంద్రబాబు అఫిడవిట్లో కచ్చితంగా ఉంటాయి, అవి  పబ్లిక్ డొమైన్లో దొరుకుతాయి. మరి ఈ ప్రకటన కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో తెలుగుదేశం వ్యూహకర్త లు కొంచెం ఆలోచించాల్సిన అవసరం వుంది. లోకేష్ ఏదో కొన్ని ఆస్తులు చదవడం మర్నాడు టీవీలో వీటి మీద చర్చలు పెట్టి రంధ్రాన్వేషణ చేయడం అవసరమా? 

90వ దశకంలో చంద్రబాబు ఆ కాలానికి తగినట్టు కొన్ని వినూత్నమైన ఆలోచన చేసి ప్రజలకు దగ్గరయినట్టు లోకేష్ సలహాదారులు కూడా  వినూత్నమైన ఆలోచనలు చేసి లోకేష్ ని ఈ కాలానికి సూట్ అయ్యే ఒక నాయకుడిగా ఆవిష్కరించాలి తప్ప ఇలాంటి పాత చింతకాయ పచ్చడి లాంటి ఆలోచనలతో  నవ్వులపాలయ్యేటట్టు చేయకూడదు. రాజకీయాల్లో ప్రతి దానికి ఒక టైమింగ్ అంటూ ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు వేలానికి వస్తున్నా టిడిపి నాయకుల ఆస్తుల మధ్య లోకేష్ చేత తన ఆస్తుల ప్రకటన చేయించిన వ్యూహకర్తల టైమింగ్ గురించి ఏం చెప్పాలి?  ఈ ఐటీ దాడులు కాకుండా రాష్ట్రంలో టిడిపి అనేక అంశాల మీద పోరాటం చేస్తోంది. ఆ పోరాటాల మీద లోకేష్ చేత ట్విట్టర్ లో స్పందింప చేసి ఆస్తుల ప్రకటన అనే ఒక ప్రజా శ్రేయస్సు లేని అంశాన్ని నేరుగా లోకేష్ చేత చెప్పించడం ఏమి వ్యూహం అనుకోవాలి. ఈ ఆస్తులేదో ట్విట్టర్లో ప్రకటించి జరుగుతున్న పోరాటాల్లో  ప్రత్యక్షంగా పాల్గొనాలని సలహా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.