ఆంధ్రాలో జిల్లాల విభజన షురూ !!

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొత్త రచ్చ మొదలైంది. జిల్లాల విభజన పై క్యాబినెట్ నిర్ణయం తీసుకుందంటూ ఓ న్యూస్ ఓ ప్రముఖ పత్రిక ద్వారా పబ్లిష్ అవ్వడంతో .. ఈ రచ్చ మొదలైంది. నిజంగా ఈ న్యూస్ నిజమా కదా అన్న సందేహాల్లో ఉన్నారు జనాలు. మొత్తానికి భిన్న వాదనల నడుమ క్యాబినెట్ ఆమోదిస్తే ఆ విషయం అధికారికంగానే బయటికి వస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జిల్లాల విభజన చేసేందుకు జగన్ ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టిందట.

తెలంగాణా సీఎం కేసీఆర్ తరహాలోనే జగన్ కూడా వ్యవహరిస్తున్నాడంటూ ఇప్పటికే పలువురు విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే. అదే నిజం అన్న తరహాలో శాసన మండలి రద్దు, జిల్లాల విభజన లాంటి విషయాల్లో తెలంగాణా సీఎం కేసీఆర్ ని జగన్ ఫాలో అవుతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. తెలంగాణా తరహాలోనే జిల్లాలను విభజించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే మచిలీపట్టణం, గురజాల, అరకు ఇలా మూడు జిల్లాల ఏర్పాటు దిశగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుందట? మచిలీపట్టణం కేంద్రంగా కృష్ణా జిల్లా కొనసాగుతోందట. విశాఖ జిల్లాలో అరకు అంతర్భాగంగా, గురజాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

అరకు కేంద్రంగా జిల్లాగా చేయాలన్న దిశలో చర్చలు కూడా జరుగుతున్నాయి. విశాఖ పట్టణం జిల్లాతో పాటు ఈస్ట్ గోదావరి జిల్లాలోని అన్ని ఏజెన్సీ ప్రాంతాలు కొన్ని కలిపి అరకు జిల్లా ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ విభజన మూడు జిల్లాలతోనే ఆగుతుందా.. లేక అన్ని జిల్లాలను విభజిస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మొత్తానికి ఆంధ్రా ప్రదేశ్ లో 25 కు పైగా జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు టాక్ ? తెలంగాణ లో జిల్లాల విభజన సజావుగా సాగింది కానీ ఆంధ్రా లో మాత్రం చాలా అనూహ్యంగా మారుతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.