మంత్రి బొత్స సత్యనారాయణ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా చేరిన తర్వాత బహు బోల్డ్ గా తయారై ముఖ్యమంత్రికి ముందే ప్రభుత్వ విధానాలే కాకుండా పార్టీ పాలసీ కూడా ప్రకటించేస్తున్నారు. తత్ఫలితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద అక్షింతలు వేయించుకుంటున్నారో లేక ప్రసంశలు పొందుతున్నారో గాని ఒక దాని వెంబడి మరో అంశం గురించి లీకులు ఇస్తున్నారు. అమరావతి నుండి రాజధాని మార్పు చేయబడుతుందని తొలుత ప్రకటన చేసి అందరూ ఉలిక్కిపడేటట్టు చేసింది మంత్రి బొత్స సత్యనారాయణ గారే. తర్వాత తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుమతితోనే ప్రకటన చేసినట్లు తదనంతర పరిణామాలు తెలియజేశాయి.
ఇప్పుడు తాజాగా ఆహ్వానం వస్తే వైసిపి కేంద్రంలోని ఎన్డీఏలో చేరితే తప్పే ముందని విశాఖలో వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఇది సంచలనమే కలిగించింది. దీనిపై తాను ఆలా మాట్లాడ లేదని వివరణ ఇచ్చారు. పైగా మంత్రి కొనాలి నాని ఇలాంటి అంశాలు ముఖ్యమంత్రి మాత్రమే ప్రకటిస్తారని చెబుతూ రాజ్యసభలో కేంద్రానికి మద్దతు అవసరమైనపుడు సాయం చేసి ప్రత్యేక హోదా అడుగు తామని బిజెపి యెడల వుండే మమకారాన్ని పరోక్షంగా తెలియ చెప్పారు. ఎన్డీఏలో చేరితే ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి పార్టీ పునాదులు దెబ్బతింటాయనే భయంతో మంత్రులు ఇంత వివరణ ఇచ్చుకున్నారు.
ఇదిలా వుండగా రాజధాని గ్రామాల్లో పర్యటనలో వున్న పవన్ కళ్యాణ్ ను మహిళలు నిలదీశారు. మూడు రాజధానులకు ప్రధాని అనుకూలంగా వున్నారనే అనుమానం వుందని వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా బిజెపి అంగీకరించిన పద్దతి పైననే తాను బిజెపితో పొత్తు పెట్టుకున్నానని బిజెపిలో వ్యక్తమైన భిన్నాభిప్రాయాలు సరిచేసుకొని ప్రకటన చేయమని బిజెపి పెద్దలను కోరినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. బిజెపి వైసిపి పొత్తు లేదని కూడా తేల్చేశారు. అందుకు అనుగుణంగా బిజెపి జాతీయ కార్యదర్శి ఎపి బిజెపి ఇన్చార్జి దేవధర్ డీల్లీ లో మాట్లాడుతూ తాము ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్షంలో వున్నామని జనసేనతో మాత్రమే పొత్తు వుంటుందని ప్రకటన చేశారు. దీనితో ఈ ఊహాగానాలకు తెరపడింది. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ ఏదో ఒక రూపంలో అభిప్రాయం వ్యక్తం చేయనిదే పలు పత్రికల్లో వార్త చోటు చేసుకోదనే అభిప్రాయమూ వుంది. అందుకే మంత్రులు చిట్చాట్ గా మాట్లాడేది పరిగణనలోనికి తీసుకోకూడదని మంత్రి కొడాలి నాని వివరించారు.
25 మంది పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఓటర్లను జగన్మోహన్ రెడ్డి నమ్మించారు. ఓటర్లు 22 మందిని గెలిపించారు. ప్రత్యేక హోదా సాధించ కుండా ఎన్డీఏ లో చేరితే ప్రమాదం ముంచుకొస్తుందనే భయంతోనే మంత్రులు జాగ్రత్త పడ్డారు. మరో వేపు తాను లౌకిక వాదినని నమ్మించినందుననే మైనార్టీ లు వారు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్ లు కావచ్చు – వీరితో పాటు దళితులు గంపగుత్తుగా వైసిపికి ఓటు వేశారు. కాబట్టి 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది పార్లమెంటు సభ్యులు గెలుపొంద గలిగారు.
ఇదిలా వుండగా రాబోవు రాజ్యసభ ఎన్నికల్లో తమకు ఒక స్థానం కేటాయించమని బిజెపి కోరినట్లు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వైసిపి వర్గాల్లో ప్రచారంలో వుంది. ఇది జరిగినా వైసిపి తన ఓటు బ్యాంకులో అనుమాన బీజాలు నాటినట్లే. ఈ ప్రచారమూ ఏమౌతుందో చూడాలి. ఇప్పటికే రాష్ట్రంలో కేంద్రం తెచ్చిన NRC NPR CAA లపై మైనారిటీలతో పాటు వివిధ వర్గాలు రగిలిపోతున్నాయి. కడపలో శనివారం ఉప ముఖ్యమంత్రి అంజాద్ ఖాన్ నాయకత్వంలో మైనార్టీలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు .మరో వేపు కాపులను ఆకట్టుకొనేందుకు పవన్ కళ్యాణ్ దూకుడుకు బ్రేక్ వేసేందుకు చిరంజీవిని రాజ్యసభకు వైసిపి తరపున పంపుతారని విశ్వసనీయ వర్గాల చెబుతున్నాయి. చిరంజీవిని రాజ్యసభకు పంపితే మాత్రం రాజకీయంగా వైసిపి లాభపడవచ్చు. కానీ మూడు రాజధానుల అమలు శాసన మండలి రద్దు కోసం ఎన్డీఏలో చేరితే లేదా ఏవిధమైన పొత్తు పెట్టుకున్నా తాత్కాలికంగా రాష్ట్రంలోని ప్రతి పక్షాల దాడులు నుండి వైసిపి బయట పడవచ్చు. అయితే అపార మైన ఓటు బ్యాంకుకు పెద్ద కన్నం పడక తప్పదు. మరో విశేషమేమంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగైదు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తూ ప్రభుత్వాల స్థాయిలో చేస్తున్న ప్రయత్నాలపై పార్టీల స్థాయిలో ఏర్పడిన ప్రకటనల ప్రభావం ఎంతో కొంత అపకారం చేయక తప్పదు. బిజెపి జాతీయ కార్యదర్శి దేవధర్ మాట్లాడుతూ తమ పార్టీ ఒకే రాష్ట్రం ఒకే రాజధానికి కట్టుబడి వుందని చెప్పడమే.
