వారందరకీ ఆశాకిరణంలా వైఎస్ జగన్ 

YS Jagan Mohan Reddy
ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనా పరంగా వేగం పెంచారు.  కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిన నేపథ్యంలో పునరుద్దరణకు, ప్రజల ఆరోగ్య, ఉపాధి భద్రతకు మార్గాలు వెతుకుతూనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వాసులను ఆదుకోవడానికి సిద్దమయ్యారు.  భారత్ నుండి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే కార్మికుల్లో అధిక భాగం తెలుగు రాష్ట్రాల నుండే ఉంటారు.  వారంతా కరోనా సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. 
 
వీరిలో ఏపీ వాసులు అధికంగానే ఉన్నారు. వారిని స్వదేశానికి రప్పించడానికి వైఎస్ జగన్ విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్‌కు లేఖ రాశారు.  అందులో కువైట్ దేశంలో చిక్కుకుపోయిన సుమారు 2500 మంది తెలుగువారిని ఆంధ్రాకు తీసుకురావడానికి విమానాలు ఏర్పాటు చేయాలని కోరారు.  ‘వందే భారత్’ మిషన్ పేరుతో పలు దేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకొస్తున్న కేంద్రం చర్యలను కొనియాడిన జగన్ కువైట్లో స్వదేశానికి రావడానికి అన్ని అనుమతులు పొంది ప్రయాణ ఖర్చులకు డబ్బులేని వారిని ఏపీకి తీసుకొచ్చేలా ప్రయత్నం చేయాలని కోరారు. 
 
ఇమ్మిగ్రేషన్‌ రుసుము రద్దు చేయడంతో ద్వారా మన దేశ రాయబార కార్యాలయం వారందరికీ ఎగ్జిట్‌ క్లియరెన్స్‌ ఇచ్చిందని, వారి ప్రయాణ ఖర్చులను  భరించడానికి కువైట్‌ ప్రభుత్వం కూడా రెడీగా ఉందని గుర్తుచేస్తూ వారిని నేరుగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతికి చేర్చేలా విమానాలు నడపాలని కోరారు.  అంతేకాదు వారంతా ఇక్కడికి చేరుకుంటే వారి వైద్య పరీక్షలు నిర్వహించడానికి, క్వారంటైన్‌లో ఉంచడానికి తాము అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉన్నామని హామీ ఇచ్చారు.  ముఖ్యమంత్రి లేఖతో కువైట్ వలస కార్మికులంతా ఊపిరిపీల్చుకున్నారు.