బిజెపి జనసేన మైత్రి ఎవరిని ముంచు తుంది?

BJP and Jansena Alliance

ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న ఏమీ కాదు. బిజెపి జనసేన రెండు పార్టీల పొత్తు బహిర్గత మైన తర్వాత వెలువడిన వ్యాఖ్యానాలు విమర్శలు ఎవరి నుండి వ్యక్తమైనవో పరిశీలించితే ఎవరికైనా సులభంగా ఈ ప్రశ్నకు జవాబు లభిస్తుంది. ఈ పొత్తుపై అధికార పార్టీకి చెందిన మంత్రులు నేతలు ఎందుకంత ఆగ్రహం ప్రకటించుతున్నారో చాల మందికి సమాధానాలు దొరకని మాట మాత్రం వాస్తవం. తుదకు వైసిపి ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి కూడా స్పందించారంటే ఈ పొత్తు వెనుక ఏదో చిదంబర రహస్యం వుండి వుండాలి

వాస్తవంలో రాష్ట్రంలో వైసిపి కి ప్రధాన ప్రత్యర్థి తెలుగు దేశం పార్టీ. అంతేకాదు. గ్రామాల స్థాయి వరకు కార్యకర్తలు గల పార్టీ. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా గ్రామ స్థాయి నుండి రాష్ట్రం వరకు పటిష్టమైన పార్టీ నిర్మాణం వుంది. తెలుగు దేశం పార్టీతో పోల్చుకుంటే జనసేన పార్టీకి పార్టీ నిర్మాణం లేదు. గ్రామ స్థాయి అటుంచి రాష్ట్ర స్థాయిలో కూడా నిర్దిష్టమైన కమిటీ లేదు. మొన్నటి ఎన్నికల్లో సింగిల్ డిజిట్ శాతంలో ఓట్లు పొందింది. కాకుంటే అసంఘటిత మైన కార్యకర్తలు వున్నారు. వాస్తవాలు ఇలా వుండగా బిజెపితో జనసేన పొత్తు పెట్టుకోవడంపై వైసిపి నేతలు ఎందుకంత కలవర పడుతున్నారు? రోజులు గడుస్తున్నా విమర్శల జడి వాన ఎందుకు సృష్టించుతున్నారు?

ఇదంతా పరిశీలిస్తుంటే వైసిపి నేతలకు ఏదో భయం పట్టుకోక పోతే ఒకరి తర్వాత మరొకరు విమర్శలు చేయ వలసిన అవసరమేమొచ్చింది? జనవరి 19 వతేదీ వైసిపికి చెందిన మీడియాలో ఒక కథనం ప్రచురితమైనది. దీని వెనుక ఏదో కుట్ర వుందని వివరించ బడింది. అదంతా కూడా పక్కన బెడితే రాష్ట్రంలో అతి సామాన్యుడైనా ఈ అంశంపై ఒక అవగాహనకు రాగలడు.చంద్రబాబు నాయుడు హయాంలో బిజెపి ద్విముఖ పాలసీ అమలు జరిపింది. చంద్రబాబు నాయుడుతో సఖ్యతగా వున్నా అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి అండదండలు ఇస్తూ వచ్చింది. తుదకు టిడిపి బిజెపి మధ్య తెగ తెంపులకు ఇదొక కారణమైనది

ప్రస్తుతం వైసిపి అధికారంలోని కొచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం అదే వైఖరి చేపట్టింది. పోలవరంలో కుంభకోణాలు విద్యుత్ కొనుగోళ్లలో అవినీతిలో చంద్రబాబు నాయుడు ఇరికించేందుకు ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలకు కేంద్రం నుండి సహకారం లభించ లేదు. పైగా చంద్రబాబు నాయుడుకు కితాబు ఇచ్చింది. కేంద్ర బిజెపి నాయకత్వం విభజించి పాలించు సిధ్ధాంతం అమలు చేస్తోంది. ఇదిలా వుండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొరకు రాని కొయ్యగా భావించి పార్టీ అధ్యక్షుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ముఖ్యమంత్రికి ఇవ్వ వలసిన పద్దతిలో ఇంటర్య్వూ కూడా ఇవ్వక పోవడంతో బిజెపితో పాటు కేంద్ర ప్రభుత్వంతో కూడా ముఖ్యమంత్రికి సత్సంబంధాల కొరవడ్డాయి.

ఈ నేపథ్యంలో బిజెపి జనసేన మధ్య పొత్తు పొడవడంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో క్షీణించిన సంబంధాలు మరింత దిగజారే ప్రమాదముందని వైసిపి అధిష్టాన వర్గంలో ఏర్పడ బట్టే ఆంధ్ర ప్రదేశ్ లో పెద్దగా ఓటు బ్యాంకు లేని పవన్ కళ్యాణ్ పై వైసిపి నేతలు దండ యాత్ర సాగిస్తున్నారు. పైగా రాష్ట్ర బిజెపి నాయకత్వం పవన్ కళ్యాణ్ తో పాటు మూడు రాజధానుల ప్రతిపాదనను నిక్ఖఛ్ఛిగా వ్యతిరేకిస్తోంది. మూడు రాజధానుల ప్రతి పాదన సాఫీగా అమలు కావాలంటే కేంద్ర ప్రభుత్వ సహకార కొన్ని సందర్భాల్లో నైనా కావాలి. ఈ పూర్వ రంగంలో బిజెపి జనసేన పొత్తు విధిగా బ్రేకులు వేసే అవకాశం ఉందని వైసిపి నేతలు పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడుతున్నారు. అంతేకాదు. మెడ మీద కత్తిలా వున్న సిబిఐ కేసుల అంశంలో కేంద్ర బిజెపి నాయకత్వ సహకారానికి తెర పడి నట్లే. అయితే మున్ముందు బిజెపి జనసేన పార్టీలు ఒకటిగా తెలుగు దేశం వేరుగా పోటీ చేస్తే వైసిపినే ముక్కోణపు పోటీలో లాభ పడుతుంది. కాని ప్రస్తుతం రాజకీయంగా వైసిపి నష్టం భరించ వలసి వుంటుంది.

గమనార్హమైన అంశమేమంటే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకొన్న బిజెపిని వైసిపి నేతలు ఒక్క మాట అనలేని దుస్థితిలో వున్నారు. ఇప్పుడు వైసిపికి చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ ప్రమాద కరమైన నేతగా కన్పిస్తున్నారు. అందుకే తెలుగు దేశం పార్టీ తమాషా చూస్తూ ఒక్క కామెంట్ చేయలేదు. కాని భవిష్యత్తు భయాలు టిడిపిని వెన్నాడుతున్నాయి.

వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013