CNX అనే రీసెర్చ్ సంస్థ డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 25 వరకు ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే కోసం 543 పార్లమెంట్ స్థానాల పరిధిలో వున్న 1086 అసెంబ్లీ సెగ్మెంట్లలో 60 వేల మంది అభిప్రాయాలు సేకరించినట్టు తెలిపింది.
ఆ సర్వే సారాంశం ఏంటంటే ప్రస్తుతం అధికారంలోవున్న ఎన్డీయే కూటమికి సంపూర్ణ మెజార్టీ రాకపోయినా 257 సీట్లతో అతిపెద్ద కూటమిగా అవతరించబోతుంది. అలాగే కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ కూటమి గతంకంటే మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ 157 స్థానాలతో అధికారానికి చాల దూరంలో నిలవనున్నది.
అదే సమయంలో ఏ కూటమిలో లేని పార్టీలు దాదాపుగా 140 సీట్లు గెలవనున్నాయి. ఇవే రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించబోతున్నాయి. ఇతరులలో సమాజవాది పార్టీ, బహుజన సమాజవాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, AIADMK, తెలంగాణ రాష్ట్ర సమితి , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ , బిజూ జనతా దళ్, ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ఇతర చిన్న పార్టీలు వున్నాయి.
సర్వే ప్రకారం సమాజవాది పార్టీ – 20, బహుజన సమాజవాది పార్టీ – 15 , తృణమూల్ కాంగ్రెస్ పార్టీ – 26, AIADMK -10, తెలంగాణ రాష్ట్ర సమితి 16 , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ-19, బిజూ జనతా దళ్-13, ఆమ్ ఆద్మీ పార్టీ -2 మరియు ఇతర చిన్న పార్టీలు-18 స్థానాలు లభించనున్నాయి.
ఈ సర్వే రాష్ట్రాల వారిగా ఇచ్చిన సంఖ్యలలో ముఖ్యంగా మనం పరిశీలించవలసిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. ఇక్కడ ప్రధాన పోటి వైస్సార్ కాంగ్రెస్ మరియు తెలుగు దేశం పార్టీల మధ్య వున్నది. ఇక్కడ వైస్సార్ కాంగ్రెస్ పంతొమ్మిది(19) సీట్లలో విజయం సాధిస్తుందని, అలాగే టీడీపీకి కేవలం నాలుగు (4) సీట్లు వస్తాయని తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ లో వున్న మొత్తము 25 స్థానాలకు గాను ప్రధాన పార్టీలు 23 సీట్లు పంచుకోగా మిగిన రెండు సీట్లు కాంగ్రెస్ కి వస్తాయని తెలిపింది.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలని దగ్గరగా పరిశీలించేవారికి బాగా తెలిసిన విషయమేంటంటే ఆంధ్ర లో కాంగ్రెస్ ప్రస్తుతం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. అటువంటిది ఏకంగా రెండు ఎంపీ సీట్లు కాంగ్రెస్ కి వస్తాయంటే ఈ సర్వే యొక్క శాస్త్రీయతని నమ్మలేము. బహుశా టీడీపీ కాంగ్రెస్ కూటమి మొత్తంగా ఆరు అంటే అది వాస్తవానికి దగ్గరగా వుండేది.
కాబట్టి ఇక్కడ మనకర్థమైయేది ఏంటంటే ఇలాంటి సర్వేలు జాతీయ స్థాయిలో ప్రజా నాడి కొంచమేరకు ప్రతిబింబిస్తాయి కానీ రాష్ట్ర స్థాయిలో వాస్తవానికి దగ్గరగా వుండవు.
బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ చెప్పినట్టు రాజకీయాలలో 15 రోజులు అనేది చాల సుదీర్ఘ సమయం ( Fifteen days is a long time in politics) . అది చాలా సార్లు నిరూపితమైంది కూడా. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో 2014 మనం చూసాం కూడా . ఆంధ్ర ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం వుంది కాబట్టి ఇలాంటి సర్వేలు చూసి పార్టీలు గెలిచేస్తున్నాం అని అనుకోవడంకంటే పెద్ద పొరపాటు ఇంకొకటి ఉండదు. ఇది ఒక దిశ (direction) మాత్రమే ఇస్తుంది. ప్రజాస్వామ్యంలో చివరి ఓటు లెక్కపెట్టేవరకు పోరు మాత్రమే, లెక్కపెట్టాక మాత్రమే గెలుపు నిర్ణయం అవుతుంది.
