2014 ఎన్నికల తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో అమరావతి తోపాటు పోలవరం ప్రాజెక్టు రెండు ప్రతిష్టాత్మక పథకాలు తెర మీద కొచ్చాయి. అమరావతి కథ అందరికీ తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు కూడా అంత కన్నా అనేక అడ్డంకులతో కునారిల్లుతోంది. దీని భవిష్యత్తు ఏమౌతుందో ఏమో గాని ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎన్నో ప్రత్యేకతలతో నిండి వుంది. శ్రీ శైలం సాగర్ ప్రాజెక్టుల నిర్మాణానికి భిన్నంగా పోలవరం నిర్మాణం జరుగుతోంది. గేట్లతో కూడిన ప్రధాన మైన ఆనకట్ట స్పిల్ వే నది గర్భంలో కాకుండా ప్రవాహం పక్కకు మళ్లించి నిర్మించు తున్నారు. దాదాపు 80 అడుగుల లోతు నుండి కాంక్రీట్ వేశారు. 50 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చినా తట్టుకొనే విధంగా స్పిల్ వే నిర్మాణం జరుగుతోంది. నదీ గర్భంలో 1750 మీటర్లు పొడువు 41 మీటర్ల ఎత్తుతో రాక్ ఫిల్ డ్యాం నిర్మించుతారు. దీని అడుగు భాగం 300 మీటర్లు వెడల్పు వుంటుంది పై భాగంలో 30 మీటర్ల వెడల్పు వుంటుంది. అంతేకాదు. నది గర్భంలో నీటి ఊట రాకుండేందుకు గట్టి దనం పడే దగ్గర నుండి ఒక గోడ కట్టుకు వస్తారు. దీన్నే డయాఫ్రం వాల్ అంటారు. ఈ తరహా నిర్మాణం ఎచ్చట ఇంత వరకు జరగలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 960 మెగా వాట్లు విద్యుదుత్పత్తి జరుగుతుంది. ఇంతటి బృహత్తర బహులార్థ సాధక ప్రాజెక్టు మరొకటి వుండదు. అపూర్వమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మింప బడుతున్న ఈ ప్రాజెక్టుకు తొలి నుండి నేటి వరకు ఎన లేని సమస్యలు చుట్టుముడుతున్నాయి.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టరు మార్పుతో ప్రాజెక్టు సమస్యల వలయంలో చిక్కుకున్నది. గత ప్రభుత్వం నియమించిన కాంట్రాక్టరును తొలి గించాలనే నిర్ణయం పలు సమస్యలకు దారి తీసింది. ఇతర అంశాలన్నీ పక్కన బెడితే ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇచ్చే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఏర్పడింది. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఒక కీలక మైన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో తరచూ కాంట్రాక్టర్లను మార్పుచేస్తే మున్ముందు ప్రాజెక్టు నాణ్యత ప్రమాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ అంశానికి తగినంత ప్రాముఖ్యం లభించ లేదు. గాని ఇది అత్యంత కీలకమైనది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టరు మార్పుతో పనులు సాగిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయాలని భావించుతున్నా ఇటీవల వచ్చిన నిపుణులు కమిటీ షడన్ బ్రేక్ వేసింది. రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టాలంటే ముందుగా కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయాలి. ఇప్పటికే కాపర్ డ్యాం కొంత భాగం నిర్మించి వున్నా మిగిలిన భాగం పూర్తి చేయాలంటే ఆ మేరకు నీళ్లు నిలిస్తే మునక ప్రాంతాల్లోని ఆవాసాలకు నష్ట పరిహారం పునరావాసం పూర్తి చేయాలని అదే సమయంలో స్పిల్ వే నిర్మాణం గేట్లు బిగించడం పూర్తి చేయాలని ఆ తర్వాతనే కాపర్ డ్యాం పూర్తి చేయాలని సూచనలు చేసింది. ఈ దెబ్బతో ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న కాల పరిమితి తలకిందులైంది. ఈ నీటి సంవత్సరం లోపు కాపర్ డ్యాం పూర్తి చేసే అవకాశాలు సన్నగిల్లాయి. కాపర్ డ్యాం పూర్తి కాక పోతే రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టే అవకాశం లేదు.
ఇదిలా వుండగా ఇటీవల ఒడిషా ప్రభుత్వం వేసిన కేసు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాజెక్టు పురోగతికి అడ్డంకిగా పరిణమించాయి. ఒడిషాకు తోడు తెలంగాణ ప్రభుత్వం సన్నాయి నొక్కులు మొదలెట్టింది. 1980 లో గోదావరి జలాల వివాద ట్రిబ్యునల్ పోలవరం ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తుతో 194 టియంసిల నీటి నిల్వ సామర్థ్యంతో (ఒరిజినల్ ప్రతి క్లాజు 6 పేజీ 80)నిర్మించుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే ఒడిషా 50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జితో నిర్మించుతున్నందున “ప్రాబబుల్ మాగ్జిమమ్ ఫ్లడ్ డిశ్చార్జి” పేర తమ రాష్ట్రం మునక ప్రాంత మౌతుందని సుప్రీంకోర్టు కెక్కింది. అయితే 110 సంవత్సరాల చరిత్ర చూస్తే ఒక మారు మాత్రమే అదీ 38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం గోదావరిలో వచ్చింది.
ఒడిషా వేసిన కేసు సందర్భంగా ఇటీవల సుప్రీంకోర్టు ప్రాజెక్టు తధాతథ రిపోర్టు సమర్పించాలని కోరింది. ఒడిషా ప్రభుత్వం స్పిల్ వే 50 లక్షల క్యూసెక్కులతో నిర్మించడాన్ని అభ్యంతర పెడుతుంటే తెలంగాణ ప్రభుత్వం 150 ఎత్తున నిర్మించడంపై అభ్యంతరం చెబుతోంది. వాస్తవంలో ఈ ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్రం వహించాలి. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 90(3)ప్రకారం పోలవరం ప్రాజెక్టు 150 అడుగుల ఎత్తులో నిర్మించుకొనేందుకు అనుమతించ బడింది.ఈ అంశంలో తెలంగాణ అభ్యంతరం చెప్పే హక్కు లేదు. కాని ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని చెప్పారు. దీనిపై ఎపిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. కాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మౌనం దాల్చారు. తర్వాత ఈ అంశం చర్చకు రాలేదు. సెక్షన్ 90 ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినందున ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు వివాదాల పరిష్కారం భాధ్యత కేంద్రానిదే. అయితే చంద్రబాబు నాయుడు గాని ప్రస్తుతం వైసిపి ప్రభుత్వ గాని నిర్మాణ బాధ్యతలు తమ నెత్తికెత్తుకున్నందున ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించలేక తికమక పడుతున్నారు
వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013
