రానా దొరకలేదని.. బెల్లంకొండ తో లాగించేస్తున్నారు

ప్రస్తుతం తెలుగులో బయోపిక్ ల హవా నడుస్తోంది. ఎటుచూసినా బయోపిక్ ల వార్తలే. ఇప్పటికే షూటింగ్ పూర్తైన కొన్ని బయోపిక్ లు విడుదలకి సిద్ధమవుతూ వుంటే, మరికొన్ని బయోపిక్ లు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ బయోపిక్ ని రెడీ చేస్తున్నట్లు సమాచారం.

కెరీర్ లో సరైన హిట్ కొట్టని బెల్లంకొండ నటనా పరంగా కూడా పెద్దగా మార్కులు వేయించుకున్నది లేదు. అటువంటి బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పెట్టి బయోపిక్ అంటే వినటానికి కొద్దిగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ నిజమే అని తెలుస్తోంది. ఆ బయోపిక్ మరెవరో కాదు టైగర్ నాగేశ్వరరావు ది.

గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ను దర్శకుడు వంశీకృష్ణ రూపొందించనున్నట్టు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. టైగర్ నాగేశ్వరరావు అప్పట్లో ధనికులను దోచేసి ఆ ధనాన్ని పేదవారికి పంచేవాడని రాబిన్ హుడ్ లా బ్రతికేవాడని చెప్పుకునేవారు. ఈ బయోపిక్ ను ముందుగా నానితో చేయనున్నట్టుగా ప్రచారం జరిగింది.

ఆ తరువాత రానా పేరు తెరపైకి వచ్చింది. ఈ రాబిన్ హుడ్ పాత్రకి రానా సరిగ్గా సరిపోతాడనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో బలంగా వినిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా రానా కూడా చేయడం లేదనేది తాజా సమాచారం. ఈ కారణంగానే ఈ కథ బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరికి వచ్చిందట. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్.. దర్శకుడు వంశీకృష్ణ మధ్య కథా చర్చలు జరుగుతున్నాయట. బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే అంటాడో లేదో చూడాలి మరి.