పొలం కంచెకు చిక్కి విలవిల్లాడిన చిరుత… చివరకు ఏం జరిగిందంటే

పొలం చుట్టూ రైతు ఏర్పాటు చేసిన ఇనుప కంచెకు చిక్కుకున్న చిరుతపులి  బాధతో విలవిల్లాడింది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని కోనాపురం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు వెంకటనారాయణ తన పొలం చుట్టూ ఇనుపు ముళ్ల కంచెను ఏర్పాటు చేశాడు. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లిన రైతుకు కంచెకు చిక్కుకుని అరుస్తున్న చిరుత కనిపించింది.

చిరుతను చూసిన రైతు వెంటనే గ్రామస్థులకు, అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించి పెనుకొండ అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. దాని వయసు ఏడాది ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం దానిని తిరుపతి జూకు తరలించినట్టు చెప్పారు.