కుదిరినప్పుడు టెన్నిస్‌ ఆడతా

‘సాహో’ సినిమాతో సౌత్‌ ఇండియాకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు శ్రద్ధాకపూర్‌. మొన్నామధ్య ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ ‘సైనా’ నుంచి శ్రద్ధాకపూర్‌ తప్పుకున్న విషయం తెలిసిందే. ‘సైనా’లో ఇప్పుడు పరిణీతీ చోప్రా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తప్పుకున్నందుకు ఏమైనా పశ్చాత్తాప పడుతున్నారా? అనే ప్రశ్నను శ్రద్ధాకపూర్‌ ముందు ఉంచితే… ‘‘నా జీవితంలో నేను దేని గురించీ రిగ్రెట్‌ ఫీలవ్వను.నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను. దురదృష్టవశాత్తు ‘సైనా’ ఫస్ట్‌ డే షూటింగ్‌లోనే నేను అనారోగ్యానికి గురయ్యాను. దాంతో షూటింగ్‌ కాస్త వాయిదా పడింది. ఆ లోపు ‘ఏబీసీడీ 3’లో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. ‘ఏబీసీడీ 2’ సినిమా నా కెరీర్‌లో మంచి హిట్‌. అలాంటప్పుడు ‘ఏబీసీడీ 3’ సినిమాకు నో చెప్పాలనుకోలేదు. అప్పటికే నేను ‘చిచ్చోరే’, ‘సాహో’ సినిమాలతో బిజీగా ఉన్నా. అందుకే ‘సైనా’ చిత్రానికి తిరిగి డేట్స్‌ కేటాయించలేకపోయాను.ఫలితంగా ఆ ప్రాజెక్ట్‌ చేజారింది’’ అని చెప్పారు. ఒక బయోపిక్‌ని మిస్సయిన మీకు ఇప్పుడు ఎవరి బయోపిక్‌లో అయినా నటించాలని ఉందా? అనే ప్రశ్నను శ్రద్ధా ముందు ఉంచితే – ‘‘సానియా మీర్జా (ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి) బయోపిక్‌ ఆలోచన ఉంది. ఆమెది గ్రేట్‌ జర్నీ. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. రోనీ స్క్రూవాలా దగ్గర సానియా మీర్జా బయోపిక్‌ హక్కులు ఉన్న సంగతి తెలిసిందే. మరి.. శ్రద్ధాని రోనీ నాయికగా తీసుకుంటారా? అనేది కాలమే చెప్పాలి.