‘మేజర్ చంద్రకాంత్’: ఎన్టీఆర్‌కు మోహన్‌బాబు రెమ్యునేషన్ ఎగ్గొట్టారు

వైస్రాయ్‌ హోటల్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం వాస్తవమని, అది తాను చూశానని సినీనటుడు, వైఎస్సార్‌ సీపీ నాయకుడు మంచు మోహన్‌బాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో మంట పుట్టించింది. దాంతో వారు ఆయన పై విరుచుకుపడ్డారు.

నట ప్రపూర్ణ అని చెప్పుకునే మోహన్‌బాబు ఊసరవెల్లిలా ఎవరు ప్యాకేజీ ఇస్తే వారి గురించి మాట్లాడతారని ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న ఆరోపించారు. చంద్రబాబుపై బురదజల్లేందుకు మోహన్ బాబుకి ఎంత పారితోషికం అందిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

పారితోషికం ఇవ్వందే ఏమీ మాట్లాడరని సినీ పరిశ్రమలో ఆయనకున్న పేరని ఆరోపించారు. గురువు దాసరికే పంగనామాలు పెట్టిన వ్యక్తి మోహన్ బాబు అని విమర్శించారు. మోహన్ బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతితో స్టేట్‌మెంట్ ఇప్పిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు.

సినిమాల్లో అవకాశాలు ఇప్పించిన ఎన్టీఆర్‌నే మోసం చేశారని, మేజర్ చంద్రకాంత్ సినిమాకు పారితోషికం ఎగ్గొట్టారని విమర్శించారు. జగన్‌కు పెయిడ్ వర్కర్‌గా మారి చంద్రబాబును విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
పది రోజులు ఆయన కాల్షీట్లు జగన్‌కు అమ్ముకున్నారని విమర్శించారు.