టీవీ న‌టుడి భార్య ఆత్మ‌హ‌త్య‌

టీవీ న‌టుడు మ‌ధు ప్ర‌కాష్ భార్య భార‌తి (34) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. గ‌త కొంత కాలంగా భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య జ‌రుగుతున్న గొడ‌వ‌లే భార‌తి ఆత్మ‌హ‌త్య‌కు దారితీశాయ‌ని రాయ‌దుర్గం పోలీసులు చెబుతున్నారు.  ఏఎస్ ఐ వ‌హీద్ క‌థ‌నం ప్ర‌కారం… గుంటూరుకు చెందిన భార‌తికి.. మ‌ణికొండ పంచ‌వ‌టి కాల‌నీలో నివాసం వుండే టీవీ న‌టుడు మ‌ధు ప్ర‌కాష్‌కు 2015లో వివాహం జ‌రిగింది. భార‌తి న‌గ‌రంలోని ఓ ప్రైవేట్ సంస్థ‌లో ఉద్యోగం చేస్తున్నారు. గ‌త కొంత కాలంగా భ‌ర్త‌తో పాటు అత్తామామ‌లు, మ‌రిదితో క‌లిసి వుంటున్నారామె. అయితే గ‌త కొంత కాలంగా టీవీ షూటింగ్‌ల కార‌ణంగా భ‌ర్త ఇంటికి ఆల‌స్యంగా వ‌స్తున్నారు.

ఇది భార‌తికి న‌చ్చ‌క‌పోవ‌డంతో త‌ర‌చూ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. సోమ‌వారం కూడా ఆల‌స్యంగా ఇంటికి రావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం ఉద‌యం ప‌దిగంట‌ల‌కు జిమ్‌కు వెళ‌తాన‌ని చెప్పి మ‌ధు ప్ర‌కాష్ అట్నుంచి అటే షూటింగ్‌కు వెళ్లిపోయాడు. దీంతో ఆగ్ర‌హించిన భార‌తి భ‌ర్త‌కు వీడియో కాల్ చేసి తాను ఉరివేసుకుంటున్న‌ట్టు బెదిరించారు. అయితే య‌ధావిధిగా షూటింగ్ ముగించుకుని రాత్రి 7.30కి ఇంటికి వ‌చ్చిన మ‌ధు ప్ర‌కాష్ త‌న భార్య భార‌తి గ‌దికి వెళ్లి చూశారు. లోప‌లి నుంచి గ‌డియ‌పెట్టి వుండ‌టం, ఎంత‌కీ తీయ‌క‌పోవ‌డంతో త‌న వ‌ద్ద వున్న మ‌రో తాళంతో గ‌ది త‌లుపులు తీసి చూసేస‌రికి చీర‌తో భార‌తి ఉరివేసుకుని మ‌ర‌ణించి క‌నిపించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు. అత్త మామ‌లు వేరొక గ‌దిలో ఉండ‌గా.. మ‌రిది ఆ స‌మ‌యంలో ఇంట్లో లేర‌ని తెలుస్తోంది.