‘ఇదం జగత్’ టీజర్ విడుదల చేసిన వైఎస్ జగన్

 కథానాయకుడు సుమంత్ నటిస్తున్న మరో వైవిధ్యమైన  చిత్రం ఇదం జగత్ టీజర్ ఆవిష్కరణ మంగళవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు అందజేసి చిత్ర విజయం సాధించాలని కోరుకున్నారు. అంజు కురియన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ  వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదుగా మా టీజర్ విడుదల కావడం ఎంతో ఆనందంగా వుంది. ఇక సినిమా విషయానికొస్తే సుమంత్ ఈ చిత్రంలో  కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.  తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చేయ్యబోతున్నాడు. విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు.  సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుంది. ఈ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కో-ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీల్ శ్రీ కంఠం, నిర్మాతలు: జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్