‘సాహో’:దర్శక,నిర్మాతలు అలా చేయటం కరెక్టేనా?

“సాహో” మూవీ మ్యూజిక్ అందించే బాధ్యతలనుండి మేము తప్పుకుంటున్నామని సోషల్ మీడియా ద్వారా సంగీత దర్శకులు శంకర్,ఎహ్సాన్, లాయ్ లు తెలియచేసిన సంగతి తెలిసిందే. ‘సాహో’ షూటింగ్ దాదాపుగా పూర్తవుతున్న నేపథ్యంలో సంగీత దర్శకులు సినిమా నుంచి తప్పుకోవడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. అయితే సినిమా నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అన్న విషయంపై శంకర్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

శంకర్ మాట్లాడుతూ…‘ ‘సాహో’లో బయటి కంపోజర్ల నుంచి మరిన్ని పాటలు యాడ్‌ చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ విషయం మాకు కాస్త ఇబ్బందిని కలిగించింది. సినిమాకు మేమే సంగీత దర్శకులుగా ఉండాలని అనుకున్నాం. అందుకే సినిమా నుంచి తప్పుకొన్నాం. సినిమాకు మేమింకా పాటలు కంపోజ్‌ చేసే పనిలోనే ఉన్నాం.

ఈ మధ్యకాలంలో ఒక సినిమాకు ఎందరో సంగీత దర్శకులు కలిసి పనిచేయడం చూస్తూనే ఉన్నాం. ఇదే విషయం గురించి నిర్మాణ సంస్థ మాతో చర్చించింది. అయితే మాకు ఇష్టంలేదని చెప్పేశాం. ఎందుకంటే ఒక సినిమాకు ఒక సంగీత దర్శకుడే సంగీతం అందిస్తారు. ఫలానా సినిమాకు సంగీతం అందించి ఆయనే అని చెప్పడంతోనే మనకు గౌరవం దక్కుతుంది’

అలాగే ‘ఈ సినిమాకు సంగీతంతో పాటు నేపథ్య సంగీతం కూడా మేమే అందించాలనుకున్నాం. కానీ నిర్మాణ సంస్థ అందుకు వేరొకరిని నియమించుకుంది. కనీసం పాటల వరకైనా మమ్మల్ని మాత్రమే తీసుకోవచ్చు కదా? నేను, ఎహసాన్‌, లాయ్‌ కలిసి ఎన్నో సినిమాలకు సంగీతం అందించాం. మేం మల్టిపుల్‌ కంపోజర్స్‌ అనే ఐడియాను వ్యతిరేకించడంలేదు. కానీ అంతమందితో కలిసి పనిచేయాలంటే మాకు సౌకర్యంగా ఉండదు’ అని వెల్లడించారు శంకర్‌.

ఇక ఈ సినిమాకు తమన్ ని నేపధ్య సంగీతానికి తీసుకోవటమే మొదట ఇబ్బందిగా మారిందని సమాచారం. అలాగే గిబ్రాన్ సైతం దర్శకుడు సీన్ లోకి తీసుకొచ్చి పాటలు చేయించటం కూడా విభేదాలు పెద్దవి అయ్యేలా చేసాయని తెలుస్తోంది.