గ్యాంగ్స్టర్ సూరి మర్డర్ మిస్టరీలో అసలు నిజాలివీ!
గ్యాంగ్ స్టర్ మద్దెలచెర్వు సూరి హత్య జరిగి ఇప్పటికే ఏడెనిమిదేళ్లయ్యింది. నేటికీ ఆ హత్యోదంతం జనాల్లో హాట్ టాపిక్. సూరి అనుచరుడు భాను హత్య చేసి జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. భాను సూరికి ఎంతో నమ్మకస్తుడు. కానీ భూదందాలు.. ఆర్థిక వ్యవహారాల్లో ఇద్దరి మధ్యా లుకలుకలు బయటికొచ్చాయి. అప్పట్లోనే వీళ్లంతా రకరకాల గొడవలతో కోర్టుల చుట్టూ తిరిగేవారు. అదే సమయంలో ఈ గ్యాంగ్ కి స్నేహితుడైన నిర్మాత సి.కళ్యాణ్ రక్త చరిత్ర సినిమాలు తీయడం.. సూరి పెట్టుబడులు పెట్డడం సంచలనమైంది. ఆ క్రమంలోనే సూరి హత్య ప్రకంపనాలు సృష్టించింది. తాజాగా ఆ సంగతులన్నీ తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుని హోదాలో సి.కళ్యాణ్ ఓ చానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పాత సంగతుల్ని ఆయన మరోసారి గుర్తు చేసుకున్నారు.
అసలు సూరికి మీకు… పరిటాలకు మీకు ఏంటి సంబంధం? అంటే పరిటాల హత్య జరిగాక తొలిగా పోలీసులు వచ్చింది నా దగ్గరకే అని సి.కళ్యాణ్ తెలిపారు. సినిమాలతోనే వీళ్లందరితో అనుబంధం కుదిరిందని అన్నారు. భాను సూరితో పరిచయం `రక్త చరిత్ర`తో అనుబంధంగా మారింది. తొలిగా ఓ పోలీస్ స్టేషన్ లో ఆ ఇద్దరిపైనా కేసు పెట్టానని అలా 2005లోనే పరిచయం మొదలైందని తెలిపారు. పరిచయం తర్వాత స్నేహం కుదిరింది. సూరి అంటే నాకు అభిమానం. నేనంటే ఆయనకు అభిమానం. కళ్యాణ్ అన్న అని ప్రేమగా పిలిచేవాడు. తన మనుషులతోనూ `కళ్యాణ్` అని సింగులర్ వాడడం నాకు తెలీదు. వీళ్లతో వైరం ఎక్కడ? అని అడిగితే.. ఖానా మెట్ (హైదరాబాద్) భూమి గొడవ సమయంలో మామధ్య వైరం ఉండేది. ఆ భూవివాదం సమయంలో పగలు గోడ కడితే రాత్రి పడగొట్టేసేవారు. దానిని సీసీ కెమెరాల్లోనూ చిత్రీకరించాను. ఆ తర్వాత స్నేహం కాస్తా `రక్త చరిత్ర` సినిమాతో అనుబంధంగా మారిందని వెల్లడించారు.
భూ వివాదాల్లో పోలీస్- సీఐడీ వాళ్లు మా ఆఫీస్ కి వచ్చి రెండు మూడు కార్ల నిండా డాక్యుమెంట్లు పట్టుకెళ్లే వారు. వీళ్లు (భాను-సూరి-మధు) కలవక ముందే నేను చేసిన రియల్ ఎస్టేట్ అది. కలిశాక అసలు నేను అది చేయనేలేదు. ఆ టైమ్ కూడా నేను వాళ్లకు ఇవ్వలేదు. రక్త చరిత్ర సినిమా గురించి తప్ప వేరొక ఆలోచనే లేదు. రామ్ గోపాల్ వర్మ సినిమా అది. జాగ్రత్తగా ఉండేవాడిని అని తెలిపేవారు.
సూరిని భాను చంపే ముందు సూరి చివరి కాల్ మీకే వచ్చిందిట కదా? అని ప్రశ్నిస్తే ఆ సంగతిని నేనే పోలీసులకు చెప్పాను. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసేందుకు సూరి నేను వెళ్లాల్సి ఉండగా.. ఆ టైమ్ లోనే ఆ ఘటన జరిగింది. ఆయనకోసం వేచి చూస్తూ నేను ఫోన్లు ట్రై చేస్తుంటే ఆ మర్డర్ గురించి తెలిసింది. అది తెలిసి కంగారు పడ్డాం. సూరి నన్ను బాగా ఇష్టపడేవారు. ఎక్కువ టైమ్ గడిపేవారు నాతో… అంటూ నాటి సంగతుల్ని సి.కళ్యాణ్ రివైండ్ చేసుకోవడం ఆసక్తికరం. భాను ఒక ముద్ద తిన్న తర్వాతనే సూరి తినేవాడు. అలాంటిది అలా చేయడం ఆశ్చర్యపరిచింది అని వెల్లడించారు. అలాగే షాలిమార్ వాళ్ల పై కొమరం పులి- ఖలేజా ఆడియో డీవీడీ-సీడీ హక్కుల విషయంలోనూ కోర్టులో కేసు నెగ్గానని వాళ్ల వల్ల నా సినీకెరీర్ డ్యామేజ్ అయ్యిందని సి.కళ్యాణ్ వెల్లడించారు.
