‘సాహో’ ఇంటర్వెల్ బడ్జెట్ : నమ్మచ్చా ? లేక నోటికొచ్చిన లెక్కలా?

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్‌, థ్రిల్లర్‌ ‘సాహో’. శ్రద్ధాకపూర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకుడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ‘బాహుబలి’రెండు చిత్రాల తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ ను అలరించేలా సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా హాలీవుడ్‌ నిపుణుల పర్యవేక్షణలో యాక్షన్‌ సన్నివేశాలను తీర్చిదిద్దుతున్నారు. ‘సాహో’ సినిమాను భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తున్నారు.

మీడియాలో ప్రచారం అవుతున్న దాన్ని బట్టి ఈ చిత్రంలోని ఓ ఫైటింగ్‌ సన్నివేశం కోసం నిర్మాతలు రీసెంట్ గా రూ.90 కోట్లు ఖర్చు చేశారు. దుబాయ్‌లోని అబుదబిలో ఆ షూట్‌ జరిగింది. ఈ చిత్ర ఇంటర్వెల్ సీన్ ని రూ. 30 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోందట. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ ఆధ్వర్యంలో షూటింగ్‌ జరుగుతున్నట్లు తెలిసింది.

దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్‌ విజయ్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 3న శ్రద్ధ పుట్టినరోజు సందర్భంగా ‘సాహో చాప్టర్‌ 2’ను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ లభించింది.