వైరల్ వీడియో: పెళ్లిలో పల్లకి మోసిన ప్రభాస్‌

స్టార్ హీరోలు, ఆత్మీయులు, బంధు మిత్రుల సమక్షంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ వివాహ వేడుకలు రాజస్థాన్‌ రాజధాని జయపుర‌లోని నిర్వహించారు. ఆదివారం రాత్రి వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు శుక్రవారమే జయపురకి చేరుకొని వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వీరిలో ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, నాగార్జున, రానా, నాని, అనుష్క తదితరులున్నారు.

పెళ్లి వేడుకకు రెండు రోజుల ముందు నుంచి తాళి కట్టే ఘట్టం వరకుఎన్టీఆర్, ప్రభాస్, చరణ్‌, రానా రాజమౌళి కుటుంబీకులతో కలిసి రచ్చ చేశారు. డ్యాన్సులతో సందడి చేశారు. కాగా..రాత్రి జరిగిన పెళ్లి వేడుకలో పెళ్లి కుమార్తె కూర్చున్న పల్లకిని ఆమె బంధువులతో పాటు ప్రభాస్‌ కూడా మోశారు. ప్రభాస్‌ పల్లకి మోస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. వేడుకలో ప్రభాస్‌, అనుష్క సందడి చేస్తున్న వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

శనివారం ఉదయం పెళ్లి కొడుకుని చేయడంతో పాటు, మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలతో వివాహ వేడుకలు పుంజుకున్నాయి. ఆదివారం రాత్రి పెళ్లి వేడుక జరిగింది. ‘ఆకాశవాణి’ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు కార్తికేయ. ఇక పూజాప్రసాద్ ప్రముఖ నటుడు జగపతిబాబు సోదరుడైన రాంప్రసాద్‌ కూతురే ‌. ఆమె గాయనిగా పేరు తెచ్చుకొన్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న కార్తికేయ, పూజాప్రసాద్‌ పెద్దల అంగీకారంతో ఒక్కటవుతున్నారు.