ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు భార్య మృతి.. చిరు ప‌రామ‌ర్శ‌..

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ర‌చ‌యిత‌లుగా త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పరుచూరి సోద‌రులు.  పరుచూరి వెంకటేశ్వరరావు – పరుచూరి గోపాలకృష్ణ బ్ర‌ద‌ర్స్‌ ఎన‌లేని కీర్తిప్ర‌తిష్ఠ‌ల్ని సొంతం చేసుకున్నారు. నేటి ఉద‌యం ప‌రుచూరి వెంకటేశ్వరరావు  స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి(74)   గుండెపోటుతో కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. దీంతో పరుచూరి ఇంట విషాదం నెల‌కొంది. విజ‌య‌ల‌క్ష్మీ మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మూవీ ఆర్టిస్టుల సంఘం స‌హా ప‌లు అసోసియేష‌న్లు త‌మ సానుభూతిని వ్య‌క్తం చేశాయి.

ప‌రుచూరికి మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి తెలిసిన‌దే. తాజాగా ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావును ప‌రామ‌ర్శించిన మెగాస్టార్ త‌న సానుభూతిని వ్య‌క్తం చేశారు. విజ‌య‌ల‌క్ష్మి గారి మ‌ర‌ణం ప‌రుచూరి కుటుంబానికి తీర‌ని లోటు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ర‌చ‌యిత‌గా.. నటుడిగా పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు టాలీవుడ్ కి విశిష్ఠ సేవ‌లందించారు. సోద‌రుడు పరుచూరి గోపాల‌కృష్ణ‌తో కలిసి దాదాపు 350 పైగా తెలుగు సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమా రైట‌ర్లుగా వారికి ఎదురే లేదు. టాలీవుడ్ అగ్ర హీరోలంద‌రికీ వారే ర‌చ‌యిత‌లు. ఇటీవ‌లే రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించిన `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రానికి ప‌ని చేశారు.