యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వెంకీ కుడుముల దర్శకత్వంలో `భీష్మ` ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. రష్మిక మందన ఈ చిత్రంలో కథానాయిక. నా కెరీర్ లో ఇది ఎంతో ప్రత్యేకమైన సినిమా అని నితిన్ తెలిపారు. మరోవైపు సీనియర్ దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి తోనూ రెగ్యులర్ షూటింగ్ కి నితిన్ రెడీ అయ్యారని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. యేలేటి దర్శకత్వంలో షెడ్యూల్ ప్రారంభించారట. ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇరువురు భామల నడుమ నితిన్ పాత్ర చాలా రొమాంటిక్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించాల్సి ఉంది. 2020 వేసవిలో సినిమాని రిలీజ్ చేయాలన్నది ప్లాన్.
ఈ రెండిటితో పాటు `రంగ్ దే` అనే వేరొక ప్రాజెక్ట్ పైనా నితిన్ కసరత్తు చేస్తున్నాడు. `మిస్టర్ మజ్ను` ఫేం వెంకీ అట్లూరి ఆ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రాశీ ఖన్నాను కథానాయికగా ఫైనల్ చేశారు. అయితే వెంకీ కుడుమల సినిమాకి, ఏలేటి సినిమాకి మధ్య షెడ్యూల్స్ ని ఎలా మ్యానేజ్ చేస్తున్నారు? అంటే .. ఒకదానితో ఒకటి క్లాష్ లేకుండా పక్కాగా డిజైన్ చేయడంతో రెండిటినీ ఒకేసారి పరుగులు పెట్టించేస్తున్నాడట.