మెగా ఫ్యామిలీలో విబేధాలపై చాలా కాలంగా రకరకాల కథలు వినిపిస్తుంటాయి. చిరంజీవి ఫ్యామిలీతో అల్లు అరవింద్ కుటుంబానికి వైరం ఉందని.. పవన్ కళ్యాణ్ -చిరంజీవి మధ్య మాటలు లేవని… అరవింద్ అంటే పవన్ కళ్యాణ్ కి సరిపడదని ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే ఉన్నాయి. వీటిని అరవింద్ ఎప్పటికప్పుడు ఖండించి కుండబద్దలు కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్ నిర్మోహమాటంగా రాజకీయాల పరంగా అన్నయ్యతో విబేధించి బయటకు వచ్చాను తప్ప! అతని ఎప్పటికీ నాకు అన్నయ్యే..నేను తమ్ముడినే..నాకు వదిన తల్లి తో సమానం అని ఎన్నోసార్లు చెప్పారు.
అయినా మెగా ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయంటూ ఎప్పటికప్పుడు ప్రచారం సాగుతూనే ఉంటుంది. వీటిపై ఏనాడు మెగాస్టార్ స్పందించింది లేదు. రాసే వాళ్లు రాసుకుంటారు..నా పని నేను చేసుకుంటాను అన్నట్లే! ఆయన వీటిని ఎప్పుడూ అంత సీరియస్ గా తీసుకోలేదు. అయితే తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో వాటన్నింటిపైనా మెగాస్టార్ తనదైన శైలిలో స్పందించారు. మా అన్నదమ్ములం వేరు వేరు ఇళ్లలో ఉంటున్నా.. మేమంతా ఒకే కుటుంబం. అంతా ఎప్పటికప్పుడు కలుసుకుంటాం. అందులో అల్లు అరవింద్ కుటుంబం కూడా ఉంది. అల్లు అరవింద్ కుటుంబంతో నాకు ఎలాంటి విబేధాలు లేవు. వాళ్ల ఇంటికి నేను వెళ్తాను…నా ఇంటికి వాళ్లు తరుచూ వస్తుంటారు. సంక్రాంతిని అంతా ఒకేచోట జరుపుకుంటున్నాం. అల్లు అరవింద్ తో రెగ్యులర్ టచ్ లో ఉంటాను. నాకు ఆయన సలహాలు ఇస్తారు. నేను ఆయనకు సలహాలు ఇస్తాను. ఏ విషయం అయినా మా ఇద్దరి మధ్యా కచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది. ఒకరికి తెలియకుండా మరోకరం ఏ పని చేయం. తమ్మడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ పర్యటనంతా ఇంటికొచ్చిన వెంటనే నా భార్య సురేఖ తనకు నచ్చిన వంటకాలను సిద్దం చేసి పవన్ కోసం ఇంటికి పంపుతుంది. నాగబాబు కూడా మాతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడు.. అంటూ తమ మధ్య ఆప్యాయతల్ని అనుబంధాల్ని తెలియజేశారు.
అసలు మా మధ్య విబేధాలు రావడానికి కారణాలు ఏం ఉంటాయి. ఇలాంటి వార్తలు మీ వద్దకు ఎలా వస్తున్నాయి? అంటూ చిరంజీవి ఆరా తీయడం ఆసక్తికరం. ఇక తమపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేందుకే మెగా ఫ్యామిలీ అంతా పండగల వేళ ఓ చోట చేరి ఇటీవల సెలబ్రేషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత దసరా-దీపావళి- వినాయక చవితి- క్రిస్మస్ ప్రతిదీ కుటుంబాలన్నీ కలిసి జరుపుకోవడం మెగాభిమానులు సహా అందరిలోనూ హాట్ టాపిక్ అయ్యింది.