జనవరి 9 నే వర్మ ” లక్ష్మీస్ ఎన్టీఆర్ “

అనుకున్నట్టుగానే రామ్ గోపాల్ వర్మ తన “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” చిత్రాన్ని తిరుపతిలో ప్రారంభించాడు . వర్మకు నమ్మకాలు లేవు , దేవుడిపై భక్తి కూడా లేదు . అయినా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకొని మరీ సినిమా మొదలు పెట్టడం అందరికీ వింతగానే వుంది .  అయితే తిరుమల శ్రీవారి సాక్షిగా మొదలు పెట్టాలనే ఆలోచన బహుశ  నిర్మాత రాకేష్ రెడ్డిది అయి ఉండొచ్చు .

“లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు నిర్మాత రాకేష్ రెడ్డి . ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు . లక్ష్మి పార్వతి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో కొన సాగుతున్నారు . బాలకృష్ణ , క్రిష్  నిర్మిస్తున్న “ఎన్టీఆర్ బయో పిక్ ” ఎక్కడ పూర్తి అవుతుందో అక్కడ నుంచి వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్  ప్రారంభమవుతుందట . బాలకృష్ణ సినిమాలో లక్ష్మి పార్వతి  పాత్ర లేదని అంటున్నారు . వర్మ తీసే సినిమాలో లక్ష్మి పార్వతీ పాత్రే కేంద్రం గా ఉంటుంది .  ఈ సినిమా తీయడం పట్ల లక్ష్మి పార్వతి సంతోషం వ్యక్తం చేశారు . 25 సంవత్సరాల పోరాటానికి ఓ రూపాన్ని వర్మ ఇవ్వడం సంతోషంగా వుంది . ఇప్పుడు తన మనసు ఎంతో ప్రశాంతంగా ఉందని ఆమె అన్నారు . జగన్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు

నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ “లక్ష్మీస్ ఎన్టీఆర్  రాజకీయ చిత్రం కాదు , రామారావు గారి అభిమానంతో నిర్మిస్తున్నాం. అని చెప్పారు .నిర్మాత రాకేష్ రెడ్డి ఇది రాజకీయ సినిమా కాదని చెప్పినా లక్ష్మీస్ ఎన్టీఆర్  ముమ్మాటికీ రాజకీయ సినిమానే . అందులో ఏ  మాత్రం సందేహం లేదు . ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి జనవరి లో విడుదల చేస్తామని చెప్పాడు . లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబును టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది . వెన్నుపోటు పొడిచి చంద్ర బాబు గద్దె నెక్కాడని ఈ చిత్రంలో చూపించే అవకాశం వుంది .  వచ్చే ఎన్నికల్లో చంద్ర బాబును ఓడించడానికి ఇదొక అస్త్రంగా  వాడాలని చూస్తున్నారు . అందుకే ఆగిపోయిందనుకున్న సినిమా ప్రారంభమవుతుంది .

బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్  జనవరి 9 న మొదటి భాగం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు . బహుశ “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” చిత్రాన్ని కూడా జనవరి 9నే విడుదల చేసే అవకాశం వుంది . బాలకృష్ణ సినిమా మీద లక్ష్మి పార్వతి సినిమా విడుదలయ్యే  అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి . ఆ సినిమాను  దెబ్బ కొట్టడం , రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి రాజకీయ ప్రయోజనము కలిగించడం లక్ష్మీస్ ఎన్టీఆర్  లక్ష్యంగా కనిపిస్తుంది .

వర్మ కు ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం , ఆరాధనా భావం . ఆయన్ని సగర్వంగా తెర పై చూపిస్తానని చెబుతున్నాడు . ఆయన జీవితంలో తొలిసారి తిరుమల బాలాజీని దర్శించుకున్నాడు .