ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా ‘కౌసల్య కృష్ణమూర్తి’

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మాత కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి – ది క్రికెటర్‌’.

ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ”ఒక ఆడపిల్లకి చక్కని సంబంధం చూసి పెళ్ళి చేయాలంటే మంచిచెడులు చాలా చూడాలి. అలాగే పెళ్లీడుకొచ్చిన మా ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాను కూడా మంచి రోజు చూసి విడుదల చెయ్యాలని అనుకున్నాం. అలా ఆగస్ట్‌ 23 చాలా మంచి రోజు అని భావించి ఆరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రెండు వందల శాతం ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఈనెల 23న విడుదల చేస్తున్నాం. ఎటువంటి సినిమానైనా ఎదుర్కోగలుగుతుంది అనే నమ్మకం వచ్చిన తర్వాతే మా సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. భీమనేని శ్రీనివాసరావు చేసిన ఓ మంచి సినిమా. ఐశ్వర్యా రాజేష్‌ అనే మంచి నటిని తీర్చిదిద్దిన సినిమా ఈ ‘కౌసల్య కృష్ణమూర్తి’. ఎంతో గొప్పగా నటించిన రాజేంద్రప్రసాద్‌ ఈ సినిమాకి గొప్ప బలం. అటువంటి రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, భీమనేని శ్రీనివాసరావు.. ఈ ముగ్గురూ తెలుగు ప్రేక్షకులకు అందించే మరో గొప్ప సినిమా
‘కౌసల్య కృష్ణమూర్తి’ అని నమ్ముతూ.. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ ద్వారా మరో మంచి సినిమాను తీసుకొస్తున్నాము. తప్పసరిగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను”
అన్నారు.