ఎన్టీఆర్ నిర్మాత‌ల‌కు అక్షింత‌లు.. అంత త‌ప్పేం చేశారు?

ఒక్కోసారి అత్యుత్సాహం చూపిస్తే దాని ఫ‌లితం కూడా అలానే ఉంటుంది. కేజీఎఫ్‌ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ని మెప్పించేందుకని ఆయ‌న‌ను పైకి లేపేందుకు మైత్రి మూవీ మేక‌ర్స్ చేసిన ఆ ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. ఆయ‌న‌తో ఎలానూ ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉండ‌గా `బ‌ర్త్ డే పేరుతో ఫుల్ పేజీ యాడ్లు` ఇచ్చి క‌న్న‌డ నిర్మాత‌ల ఆగ్ర‌హానికి గురి కావాల్సి వ‌చ్చింది. నేరుగా మ‌నోళ్ల‌కు అట్నుంచి హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి.

ఇలాంటి ప‌ని చేయ‌డం వ‌ల్ల హీరోలు నిర్మాత‌లు నెత్తికెక్కి కూచుంటారు. ఇది ఇత‌రుల‌కు అద‌న‌పు భారంగా మారుతుంది. మ‌మ్మ‌ల్ని ఇలా వ‌దిలేయండి. మా ప‌రిశ్రమ‌ను ఇలా వ‌దిలేయండి.. అంటూ అటువైపు ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. మీరిలా చేయ‌డం వ‌ల్ల మేం కూడా అలా ప‌త్రిక‌ల‌కు పేజీల‌కొద్దీ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాల్సిన దుస్థితి వ‌స్తుంది! అంటూ మైత్రి బృందానికి అలానే తెలుగు నిర్మాత‌ల‌కు అక్షింత‌లు వేశారు.

నిజ‌మే వాణిజ్య ప్ర‌క‌ట‌నల విష‌యంలో అత్యుత్సాహం త‌గ‌దు. దానికి ఛాంబ‌ర్ – నిర్మాత‌ల మండ‌లి రూల్స్ అనుస‌రించాల్సి ఉంటుంది. నిర్మాత‌ల గిల్డ్ వాళ్లు సెట్ చేసిన నియ‌మ నిబంధ‌న‌ల్ని అనుస‌రించి ఫుల్ పేజీ యాడ్లు ఇవ్వ‌కూడదు. కానీ మైత్రి వాళ్లు దానిని అతిక్ర‌మించారు. ప్ర‌శాంత్ నీల్ బ‌ర్త్ డే పేరుతో ఫుల్ పేజీ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రం మైత్రి సంస్థ‌లో కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తోనే అంటూ ఇప్ప‌టికే ప్ర‌చారం హోరెత్తించేస్తున్న సంగ‌తి తెలిసిందే.