మాయావిని ఎన్టీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడా?

కేజీఎఫ్ డైరెక్ట‌ర్ క్యూలో ఉన్నాడంటూ భ‌య‌పెట్టాడా?

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌దుప‌రి చిత్రానికి స‌న్నాహకాలు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లుమార్లు స్క్రిప్టు విష‌య‌మై తార‌క్ – త్రివిక్ర‌మ్ భేటీ అయ్యారు. క‌థా చ‌ర్చ‌లు సాగించారు. తాజాగా మ‌రోసారి త్రివిక్ర‌మ్ ఇంట్లో తార‌క్ క‌లిసార‌ట‌. ఈసారి మీటింగులో ప్ర‌థ‌మార్థం స్క్రిప్టు మొత్తం వినిపించేశార‌ని సెకండాఫ్ పెండింగులో ఉంద‌ని తెలుస్తోంది.

స‌గ‌భాగం స్క్రిప్టును సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే పూర్తి చేస్తే సెట్స్ కెళ్లిపోదామ‌ని తార‌క్ అన్నార‌ట‌. అయితే త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికే వెంక‌టేష్ – నానీ హీరోలుగా మ‌ల్టీస్టార‌ర్ స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సెట్స్ నుంచి తార‌క్ తిరిగి వ‌చ్చేలోపు దానిని పూర్తి చేయాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్. కానీ తార‌క్ ఇప్పుడే తొంద‌ర పెట్టేస్తున్నాడు కాబ‌ట్టి ఈ స్క్రిప్టుపైనా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తాడ‌ట‌.

మొత్తానికి భ‌య‌పెట్టి అయినా తార‌క్ త‌న ప‌ని ముందే చేయించేసుకుంటున్నాడ‌న్న గుస‌గుసా వినిపిస్తోంది. ఇప్ప‌టికే తార‌క్ క్యూలో కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ వెయిటింగులో ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో త్రివిక్ర‌మ్ కూడా అలెర్ట్ అయిపోయాడ‌ట‌. తార‌క్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోని సినిమాని హారిక హాసిని క్రియేష‌న్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి.